Reading Time: 2 minutes

మనతెలంగాణ/హైదరాబాద్: రాజ్యాంగం పట్టుకొని తిరిగే రాహుల్‌గాంధీకి సిగ్గుంటే పార్టీ ఫిరాయింపులపై సమాధానం చెప్పాలని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ డిమాండ్ చేశారు. పార్టీ మారిన వాళ్లను రాళ్లతో కొట్టి చం పాలని గతంలో రేవంత్‌రెడ్డి అన్నారని, ఇప్పుడు రాళ్లతో ఎవరిని కొట్టి చంపాలని ఆయన ప్రశ్నించారు. ఫిరాయింపుల సంస్కృతీ గురించి మాట్లాడే నైతిక హక్కు రాహుల్ గాంధీకి, కాంగ్రెస్ పార్టీకి లేదని, స్పీకర్ చేతుల్లో అసలు ఏమీ లేదని, మొత్తం కాంగ్రెస్ పార్టీనే ఈ ఫిరాయింపుల వ్యవహారాన్ని దగ్గరుండి నడిపించిందని కెటిఆర్ మండిపడ్డారు. ఈ కేసులో రాహుల్‌గాంధీ అసలు దోషి అని ఆయన అనుమతి లేకుండా తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ ఇంతటి దారుణమైన నిర్ణయం తీసుకునే సాహసం చేయలేరని ఆయన తెలిపారు. పార్టీ ఫిరాయిస్తే ఆటోమేటిక్ డిస్‌క్వాలిఫై అని చెప్పిన రాహుల్ గాంధీ,

తెలంగాణ వచ్చి న్యాయ పత్రాల గురించి ఉపన్యాసాలు దంచిన రాహుల్, ఈరోజు స్పీకర్ తీసుకున్న నిర్ణయంపై ఏం సమాధానం చెబుతారని కెటిఆర్ ప్రశ్నించారు. రాహుల్ గాంధీ నాయనమ్మ ఇందిరాగాంధీ హర్యానాలో మొదలుపెట్టిన ఫిరాయింపులు ప్ర స్తుతం దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకు పాకిందన్నారు. 2004లో అప్పటి ఉమ్మడి రాష్ట్రంలో 26మంది ఎమ్మెల్యేలు గెలిస్తే, 10 మందిని తీసుకున్నది కాంగ్రెస్ కాదా అని కెటిఆర్ గుర్తుచేశారు. పార్టీ ఫిరాయించారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరిలకు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ క్లీన్‌చిట్ ఇవ్వడంపై బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ప్రజాస్వామ్యంపై బహిరంగ దాడిగా ఆయన అభివర్ణించారు.

ప్రజాస్వామ్య చరిత్రలో చీకటి రోజు

బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ విలేకరులతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ బిఫాం మీద ఎంపిగా పోటీ చేసిన వ్యక్తికి క్లీన్‌చిట్ ఇవ్వడం అంటే ప్రజల తీర్పును అవమానించడమేనని, పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తూ స్పీకర్ తీసుకున్న ఈ నిర్ణయం ప్రజాస్వామ్య చరిత్రలో చీకటి రో జు అని ఆయన పేర్కొన్నారు. ఇది కేవలం ఒక తీర్పు కాద ని, అధికారంలో ఉన్నవారికి అనుకూలంగా రాజ్యాం గ వ్యవస్థలను ఉపయోగించే ఉదాహరణ అని ఆయన అన్నా రు. భారతదేశ చరిత్రలోనే గతంలో ఎన్నడూ లేనంతగా ఇంత అద్భుతమైన నిర్ణయం తీసుకున్నందుకు రాహుల్‌గాంధీకి, స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్‌కు తాము సన్మా నం చేయాలనుకుంటున్నామని కెటిఆర్ ఎద్దేవా చేశారు.

కడియం సిగ్గులేకుండా ఎందుకు బ్రతకాలి?

కడియం శ్రీహరికి బిఆర్‌ఎస్ పార్టీ చేసిన అన్యాయం ఏంటి? ఆయన 2013లో వచ్చినప్పుడు కెసిఆర్ ఆయన్ను ఎంపిని చేశారు. ఆ తర్వాత డిప్యూటీ సిఎంను చేశారు. ఆపై ఎమ్మెల్సీని చేశారు. తర్వాత ఎమ్మెల్యేను చేశారు. ఆయన కూతురికి ఎంపి టికెట్ ఇచ్చారు. ఈ వయసులో ఇలాంటి ‘మురికి’ మాటలు ఎందుకు మాట్లాడుతున్నారు? ఇంత సిగ్గులేకుండా ఎందుకు బతకాలి? నేను ఇంకా బిఆర్‌ఎస్‌లోనే ఉన్నాను, నాయకత్వంతోనే ఉన్నానని మీరు చెప్పారు. అందుకే అడుగుతున్నాను, ఈ ‘థర్డ్ క్లాస్’ మాటలు ఎందుకని కెటిఅర్ ప్రశ్నించారు.

వెలుగుమట్ల భూములు భూదాన్ బోర్డువే

ఖమ్మం కార్పొరేషన్ పరిధిలోని వెలుగుమట్లలో వెయ్యి మంది పేదల ఇళ్లను ప్రభుత్వం కూలగొట్టిన ఘటనపై ఆయన మండిపడ్డారు. భూదాన్ భూముల్లో ఇళ్లు కట్టుకున్న పేదలను బలవంతంగా గెంటేసిందని, గతంలో అదే భూదాన్ భూముల్లో కొంతభాగాన్ని నాటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రైవేటు వ్యక్తులపరం చేసిందని కెటిఆర్ ఆరోపించారు. వాస్తవానికి వెలుగుమట్లలో ఇళ్లు కూలగొట్టిన ప్రాంతంలోని భూము లు భూదాన్ భూములని ఆయన తెలిపారు. 1950ల్లో ఆచార్య వినోభాబావే నాయకత్వంలో జరిగిన భూదానోద్యమంలో పలువురు దాతలు భూములను దానం చేశారన్నారు. అదేవిధంగా వెలుగుమట్లలో కూడా ఇద్దరు దాతలు 62 ఎకరాల భూమిని భూదాన్ బోర్డుకు విరాళంగా ఇచ్చారన్నారు.