
టోక్యో: ఇరాన్ యుద్ధం కారణంగా అనేక దేశాలు చమురు కొరతను ఎదుర్కొంటున్నాయి. దీంతో అంతర్జాతీయగంగా బ్యారెల్ ముడి చమురు ధర 90 డాలర్లకు మించి పెరిగింది. ఈ నేపథ్యంలో చమురు సరఫరా పెంచి ధరలను అదుపులో పెట్టడానికి వివిధ దేశాలు తమ వద్ద ఉన్న వ్యూహాత్మక చమురు రిజర్వులను విడుదల చేయడానికి సిద్ధమయ్యాయి. ఇప్పుడు జపాన్ తమ దేశంలో ఉన్న వ్యూహాత్మక చమురు నిల్వలను విడుదల చేయబోతున్నట్టు జపాన్ ప్రధాని సనాయే తకాయిచి బుధవారం వెల్లడించారు.
ఈ నెల 16 లోగా చమురు నిల్వలను విడుదల చేస్తామని ఆమె ప్రకటించారు. దీనివల్ల అంతర్జాతీయంగా చమురు ధరల స్థిరీకరణ జరుగుతుందని సికాయిచి అన్నారు. ఈ పనిచేసిన తొలి జీ7 దేశంగా జపాన్ నిలిచింది. చమురు సంక్షోభ పరిస్థితులు తలెత్తినప్పుడు చమురును ఎక్కువగా వినియోగించే దేశాలు తమ దగ్గర ఉన్న ఆయిల్ రిజర్వ్ నుంచి కొంత విడుదల చేయాలనేది ఒక ఒప్పందం. దీనివల్ల ఇతర దేశాలకు సరఫరా పెంచి, ధరలను తగ్గించి, అక్కడి ప్రజలకు ఉపయోగపడేలా చేయవచ్చు. ఈ వ్యవహారాన్ని అంతా ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ పర్యవేక్షిస్తుంది.