Reading Time: < 1 minute

హైదరాబాద్: అనర్హత పిటిషన్ల విషయంలో ఎంఎల్ఎ కడియం శ్రీహరి, దానం నాగేందర్ కు ఊరట లభించింది. కడియం, దానంలపై దాఖలైన అనర్హత పిటిషన్లపై స్పీకర్ ఈ రోజు తుది నిర్ణయం ప్రకటించారు.  బిఆర్ఎస్, బిజెపి వేసిన రెండు పిటిషన్లను స్పీకర్ కొట్టివేశారు. మొత్తం 10 మంది ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లు స్పీకర్ డిస్మిస్ చేశారు. రేపు సుప్రీంకోర్టులో ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై విచారణ జరగనుంది.  సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో నిర్ణీత గడువు ముగుస్తుండడంతో స్పీకర్ కార్యాలయం ఈ మేరకు తుది నిర్ణయం తీసుకుంది. మొత్తం పది మంది ఎంఎల్‌ఎలలో ఇప్పటికే ఎనిమిది మందికి క్లీన్ చిట్ ఇచ్చిన విషయం తెలిసిందే.

సుప్రీంకోర్టు సూచనల ప్రకారం మార్చి 12వ తేదీలోపు ఈ ఇద్దరు విషయంలో స్పీకర్ తుది నిర్ణయం ప్రకటించాల్సి ఉంది. ఈ సందర్భంగా ఎంఎల్‌ఎ దానం నాగేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు. వ్యక్తిగత నిర్ణయంతోనే కాంగ్రెస్ పార్టీ నుంచి తాను ఎంపిగా పోటీ చేశానని, తాను ఎలాంటి తప్పు చేయలేదన్నారు. ఫండ్‌మెంటల్ రైట్‌ను కాలరాసే హక్కు ఎవరికీ లేదని, గత ఆరు నెలల నుంచి క్షోభను అనుభవిస్తున్నానని, స్పీకర్‌ను కూడా ఆరు నెలలుగా ఇబ్బంది పడతూ వచ్చారన్నారు. బిఆర్‌ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన దానం నాగేందర్‌పై అనర్హత వేటు వేయాలని బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎలు పాడి కౌశిక్ రెడ్డి, బిజెపి ఎంఎల్‌ఎ ఏలేటి మహేశ్వర్ రెడ్డిలు పిటిషన్‌లు వేసిన విషయం తెలిసిందే.