
నాగ చైతన్య వైఫ్, హీరోయిన్ శోభితా ధూళిపాళ (Sobhita Dhulipala) సినీ ఆడియన్స్ కు పరిచయం అక్కర్లేని పేరు. తెలుగు, తమిళ, మలయాళం, హిందీ ప్రేక్షకుల్లో సైతం విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది. ఈ సందర్భంగా తమిళనాడులో నిర్వహించిన ప్రతిష్టాత్మక సంగీత కార్యక్రమం ‘మార్గళియిల్ మక్కళ్ ఇసై’ (Margazhiyil Makkal Isai) ఆరో ఎడిషన్ చెన్నైలోని పచ్చయప్ప కళాశాల మైదానంలో జరిగింది. ఈ ముగింపు వేడుకకు ముఖ్య అతిథిగా శోభిత హాజరయ్యింది. ఈ కార్యక్రమం మూడవ రోజు, అంటే ముగింపు రోజున డిసెంబర్ 28, 2025న విచ్చేసి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
డిసెంబర్ 26 నుంచి 28 వరకు ‘మార్గళియిల్ మక్కళ్ ఇసై’ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. సాంప్రదాయ సంగీతాన్ని ప్రజలకు మరింత చేరువ చేయాలనే ఉద్దేశంతో ప్రతి సంవత్సరం మార్గళి మాసంలో నిర్వహించే ఈ కార్యక్రమం ఈసారి కూడా విశేష స్పందనను పొందింది. మూడు రోజుల పాటు సాగిన ఈ సంగీతోత్సవంలో కర్ణాటక సంగీతం, భక్తిగీతాలు, శాస్త్రీయ నృత్యాలు ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశాయి.
ముగింపు వేడుకలో పాల్గొన్న శోభితా ధూళిపాళ మాట్లాడుతూ.. ‘‘భారతీయ శాస్త్రీయ సంగీతానికి ఉన్న గొప్ప వారసత్వాన్ని గుర్తు చేస్తూ, ఇలాంటి కార్యక్రమాలు యువతలో సాంస్కృతిక విలువలను పెంపొందిస్తాయని అన్నారు. సంగీత కళాకారులను, నిర్వాహకులను ఆమె ప్రత్యేకంగా అభినందించారు. అలాగే, సంప్రదాయ కళలను పరిరక్షించడంలో ప్రజల పాత్ర కూడా ఎంతో కీలకమని’’ శోభిత ఈ సందర్భంగా చెప్పుకొచ్చింది.
ఈ వేడుకలో పలువురు ప్రముఖ సంగీత విద్వాంసులు తమ ప్రదర్శనలతో ఆకట్టుకోగా, ప్రేక్షకులు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. నిర్వాహకులు మాట్లాడుతూ, ‘మార్గళియిల్ మక్కళ్ ఇసై’ కార్యక్రమం ప్రతి సంవత్సరం మరింత విస్తృతంగా, నాణ్యతతో కొనసాగుతుందని తెలిపారు.
మొత్తంగా, శోభితా ధూళిపాళ ముఖ్య అతిథిగా హాజరైన ఈ ముగింపు వేడుక, సంగీతాభిమానులకు గుర్తుండిపోయే అనుభూతిని అందిస్తూ విజయవంతంగా ముగిసింది. ఇకపోతే, మార్గళియిల్ మక్కళిసై అనేది శాస్త్రీయ సంగీతం, జానపద గీతాలు, సాంప్రదాయ గ్రామీణ కళలు మరియు నిరసన సంగీతం వంటి వివిధ రకాల సంగీత రూపాలకు వేదిక కల్పించడానికి సృష్టించబడిన ఒక సమ్మిళిత సాంస్కృతిక వేదిక.
ఈ కార్యక్రమాన్ని తమిళ వర్సటైల్ డైరెక్టర్ పా. రంజిత్ స్థాపించిన సంస్థ ‘నీలం కల్చరల్ సెంటర్’ ప్రతిఏటా నిర్వహిస్తుంది. సామూహిక స్ఫూర్తి మరియు సాంస్కృతిక గుర్తింపును జరుపుకునే ఈ రికార్డు సృష్టించిన వేడుకకు 40,000 మందికి పైగా ప్రజలు మరియు 500 మందికి పైగా కళాకారులు హాజరయ్యారు.