
సీఎం రేవంత్ రెడ్డి నిర్మల్ జిల్లాలో పర్యటిస్తున్నారు. చదువుల తల్లి కొలువైన పుణ్యక్షేత్రం బాసర శ్రీ జ్ఞాన సరస్వతీ దేవిని సీఎం కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు.అమ్మవారి సన్నిధిలో సీఎం రేవంత్ రెడ్డి తన మనవడికి అక్షరాభ్యాసం చేయించారు. శాస్త్రోక్తంగా జరిగిన ఈ కార్యక్రమంలో చిన్నారి చేత ఓనమాలు దిద్దించారు.
ఈ వేడుకలో రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులతో పాటు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు జూపల్లి కృష్ణారావు, కొండా సురేఖ, ఎంపీ వేమ్ నరేందర్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
అమ్మవారి దర్శనం అనంతరం, బాసర ఆలయ విస్తరణ అభివృద్ధి పనులకు సంబంధించి ముఖ్యమంత్రి భూమి పూజ చేశారు. ఆలయ రూపురేఖలను మార్చేలా ప్రభుత్వం చేపట్టిన ఈ పనులు ఇవాల్టి నుంచి వేగవంతం కానున్నాయి.
మధ్యాహ్నం 2 గంటల తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదిలాబాద్ జిల్లాలోని పిప్రి గ్రామానికి చేరుకుంటారు. అక్కడ పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయడంతో పాటు.. మధ్యాహ్నం 2:30 గంటలకు ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో పాల్గొని ప్రజలనుద్దేశించి ప్రసంగించనున్నారు.