
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని ప్రభుత్వ విద్యా సంస్థలు, గురుకుల పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు అవసరమైన వస్తువులను అందించేందుకు గురుకుల సొసైటీ టెండర్లు పిలిచింది. 2026–27 అకడమిక్ ఇయర్కు విద్యార్థులకు అవసరమైన వస్తువుల సరఫరాకు ప్రాజెక్టు మానిటరింగ్ యూనిట్(పీఎంయూ) ద్వారా ఈ -టెండర్లను ఆహ్వానించినట్టు సొసైటీ ఇన్చార్జి సెక్రటరీ కృష్ణ ఆదిత్య శనివారం తెలిపారు. వీటికి నోడల్ ఏజెన్సీగా ఎస్సీ గురుకుల సొసైటీని ప్రభుత్వం నియమించింది.
టెండర్ దాఖలుకు ఈ నెల 13 వరకు గడువు విధించగా, ఈ నెల 8న మసాబ్ ట్యాంక్ డీఎస్ఎస్ భవన్లోని ఎస్సీ గురుకుల సొసైటీ హెడ్ఆఫీస్లో ఆసక్తి ఉన్న వ్యక్తులు, సంస్థలతో ప్రీ బిడ్ మీటింగ్ నిర్వహిస్తున్నట్టు సెక్రటరీ చెప్పారు. రాష్ర్టంలో గురుకుల స్టూడెంట్స్, ప్రభుత్వ విద్యా సంస్థల్లో మొత్తం 27 లక్షల మంది ఉన్నట్టు ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. మొత్తం 9రకాల వస్తువుల సరఫరాకు టెండర్లు పిలిచారు.
వీటిలో ప్రధానంగా స్కూల్ వైట్ యూనిఫామ్ క్లాత్, స్కూల్ బ్యాగులు, షూలు, సాక్స్, టై, బెల్టులు, బెడ్డింగ్ మెటీరియల్స్ (కార్పెట్లు, బెడ్షీట్లు, బ్లాంకెట్లు, టవళ్లు), ఐడీ కార్డులు, స్టేషనరీ కిట్లు, పీటీ డ్రెస్, నైట్ డ్రెస్, ట్రాక్ సూట్లు, భోజనానికి అవసరమైన ప్లేట్లు, గ్లాసులు, కటోరా, కప్పులు, స్పూన్లు, ట్రంక్ బాక్సులు, నోట్బుక్లు, ట్రాలీ బ్యాగులు ఉన్నాయి. అర్హత గల సంస్థలు టెండర్లలో పాల్గొని పారదర్శకంగా కొనుగోలు ప్రక్రియను పూర్తి చేయాలన్నారు. జూన్ 14 నాటికి విద్యార్థులకు అన్ని వసతులు అందేలా చర్యలు తీసుకుంటున్నట్టు సొసైటీ ఇన్చార్జ్ సెక్రటరీ కృష్ణ ఆదిత్య పేర్కొన్నారు.