
ఆదిలాబాద్ జిల్లాను అన్ని రంగాల్లో సస్యశ్యామలం చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చేపట్టిన ‘పీపుల్స్ మార్చ్’ పాదయాత్రకు మూడేళ్లు పూర్తయిన సందర్భంగా పిప్రిలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా అభివృద్ధిపై కీలక ప్రకటనలు చేశారు.
ఎయిర్పోర్ట్ మరియు పారిశ్రామిక హబ్..
ఆదిలాబాద్ జిల్లా ప్రజల చిరకాల స్వప్నమైన ఎయిర్పోర్టు నిర్మాణానికి జూన్ 2వ తేదీన భూమిపూజ చేస్తామని సీఎం ప్రకటించారు. కేవలం విమానాశ్రయమే కాకుండా, ఈ ప్రాంతంలో దేశంలోనే అతిపెద్ద పారిశ్రామిక వాడను ఏర్పాటు చేయబోతున్నట్లు వెల్లడించారు. దీనివల్ల వేలాది మంది స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని, ఇందుకోసం భూసేకరణ ప్రక్రియ వేగంగా జరుగుతోందని తెలిపారు. అలాగే జిల్లాలో త్వరలోనే ఒక యూనివర్సిటీని కూడా ఏర్పాటు చేస్తామన్నారు.
Also Read:Andhra Pradesh: ఏపీ వాసులకు గుడ్న్యూస్.. ఏప్రిల్ 28న ప్రారంభం..
రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి..
ఎన్నికల సమయంలోనే రాజకీయాలని, ఆ తర్వాత కేవలం ప్రజా సంక్షేమం కోసమే పనిచేస్తామని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాల్లో కూడా నిధుల కేటాయింపులో వివక్ష చూపబోమని భరోసా ఇచ్చారు. గత ప్రభుత్వంలో ప్రతిపక్షాలను నిర్బంధించే సంస్కృతి ఉండేదని, కానీ తమ ప్రభుత్వం చట్టసభల్లోనూ, బహిరంగ వేదికలపైనూ విపక్ష నేతలకు మాట్లాడే అవకాశం కల్పిస్తోందని చెప్పారు.
తమ్మిడిహెట్టి వద్ద ప్రాణహిత ప్రాజెక్టును త్వరలోనే పునరుద్ధరించి ఆదిలాబాద్ రైతులకు సాగునీరు అందిస్తామన్నారు. ఇప్పటికే మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, ఇందిరమ్మ ఇళ్లు వంటి హామీలను అమలు చేస్తున్నామని గుర్తుచేశారు. బాసర ఆలయాన్ని దేశంలోనే అద్భుత ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దుతామని, ప్రతి రెండు నెలలకోసారి జిల్లాను సందర్శించి అభివృద్ధి పనులను పర్యవేక్షిస్తానని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు.