Reading Time: 2 minutes
చీమలే ఆహారంగా.. శత్రుదేశంలో అమెరికా పైలట్‌ దుస్థితి

శత్రుదేశంలో యుద్ధ విమానం కూలిందంటే అంతకంటే ప్రమాదకర క్షణం మరొకటి ఉండదు. ఆ పైలట్లు సురక్షితంగా బయటపడినా.. శత్రువులకు చిక్కే ప్రమాదమే ఎక్కువ. భారత్‌ పాకిస్తాన్‌పై జరిపిన సర్జికల్‌ స్ట్రైక్‌ సమయంలో మన సుఖోయ్‌ యుద్ధ విమానం పైలెట్‌ అభినందన్ పాకిస్తాన్‌ భూభాగంలో పడిపోయాడు. అయితే వెంటనే రంగంలోకి దిగిన భారత్‌.. మన పైలెట్‌ను రక్షించేందుకు చర్యలు చేపట్టింది. భారత హెచ్చరికలతో వణికిపోయిన పాకిస్తాన్‌ మన పైలెట్‌ను అప్పగించింది. తాజాగా అంటి ఘటనే ఇరాన్‌ గడ్డపై జరిగింది. ఇరాన్‌–అమెరికా యుద్ధంలో కూలిన అమెరికా ఎఫ్‌–15 యుద్ధ విమానం పైలట్‌ ఇరాన్‌లో పడిపోయాడు. అతడిని సజీవంగా పట్టుకునేందుకు ఇరాన్ ప్రయత్నించింది. అతడిని పట్టించిన వారికి 66,100 డాలర్ల బహుమతి ప్రకటించింది. అయితే.. అమెరికా స్పెషల్ ఫోర్సెస్.. ఇరాన్ కళ్లుగప్పి, అత్యంత ప్రమాదకర పరిస్థితుల్లో శత్రుదేశం నుంచి తమ పైలట్‌ను కాపాడి తీసుకుపోయాయి. శత్రు భూభాగంలో చిక్కుకున్న పైలట్‌ను రక్షించడాన్ని అమెరికా ’కంబాట్‌ సెర్చ్‌ అండ్‌ రెస్క్యూ’ ఆపరేషన్‌ అంటుంది. ఇది అత్యంత సంక్లిష్టమైన, ప్రమాదకరమైన మిషన్‌. అమెరికా ’స్విస్‌ ఆర్మీ నైఫ్స్‌’ అని పిలువబడే ప్రత్యేక రెస్క్యూ బృందాలు రంగంలోకి దిగి అతడిని కాపాడాయి. గాలింపు చేపడుతున్న రెండు బ్లాక్‌హాక్ హెలికాప్టర్లపై దాడి జరిగినప్పటికీ.. అవి ఇరాన్ గగనతలం నుంచి సురక్షితంగా బయటపడినట్టు ఇద్దరు అమెరికా అధికారులు రాయిటర్స్‌కు తెలిపారు. రెండు హెలికాప్టర్లు, ఒక విమానం తక్కువ ఎత్తులో ఎగురుతున్న దృశ్యాలు కూడా వెలుగులోకి వచ్చాయి. అమెరికా సైనికులు శత్రువులకు చిక్కడం ఇదే తొలిసారి కాదు. గత యుద్ధాల్లో అనేక మంది పైలట్లు బందీలయ్యారు, చిత్రవధలు అనుభవించారు. 2003లో ఇరాక్‌ యుద్ధ సమయంలో అమెరికా అపాచీ హెలికాప్టర్లపై ఇరాక్‌ రిపబ్లికన్‌ గార్డ్‌ మెరుపుదాడి చేసింది. ఈ దాడిలో చీఫ్‌ వారెంట్‌ ఆఫీసర్లు డేవిడ్‌ విలియమ్స్, రొనాల్డ్‌ యంగ్‌ జూనియర్‌ ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌ కూలిపోయింది. ఇంధనం అయిపోవడం, ఇంజిన్‌ వైఫల్యంతో వీరు పారాచ్యూట్లతో కిందకు దిగారు. కానీ శత్రు భూభాగంలో చిక్కుకున్నారు. ఇరాక్‌ దళాలు వీరిని చీకటి గదుల్లో బంధించి, దారుణంగా కొట్టి విచారించాయి. బాగ్దాద్‌లోని వివిధ జైళ్లకు తరలిస్తూ, అమెరికా రహస్యాల కోసం హింసించాయి. 23 రోజులపాటు ఈ చిత్రవధ అనుభవించిన వీరికి, అమెరికా దళాలు ఇరాక్‌ను లొంగతీసుకున్న తర్వాత విముక్తి లభించింది.1995లో బోస్నియా యుద్ధ సమయంలో అమెరికా ఎయిర్‌ ఫోర్స్‌ పైలట్‌ కెప్టెన్‌ స్కాట్‌ ఎఫ్‌. ఓ’గ్రేడీ విమానం కూలిపోయింది. శత్రు భూభాగంలో చిక్కుకున్న ఆయన, ఆరు రాత్రులు కొండ ప్రాంతాల్లో దాక్కోవాల్సి వచ్చింది. తాగడానికి నీళ్లు దొరకక, చీమలు తింటూ బతికారు. చివరకు రేడియో సిగ్నల్స్‌ అందడంతో అమెరికా మెరైన్‌ సిబ్బంది రెస్క్యూ మిషన్‌ చేపట్టి, క్షిపణులు, కాల్పుల నడుమ హెలికాప్టర్‌లోఆయనను రక్షించింది. తన అనుభవాలను ఆయన ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

మీర్రా దొంగలంటే.. స్టేషన్ ముందు షాపునే కొల్లగొట్టేశారు