
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని గ్లోబల్ ఐటీ హబ్గా మార్చే దిశగా రాష్ట్ర ప్రభుత్వం మరో భారీ విజయాన్ని సాధించింది. ప్రపంచ టెక్ దిగ్గజం గూగుల్ (Google), ఏపీలో 15 బిలియన్ డాలర్ల (సుమారు ₹1.25 లక్షల కోట్లు) భారీ పెట్టుబడితో డేటా సెంటర్ను ఏర్పాటు చేయబోతోంది. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు ఈ నెల 28న విశాఖపట్నం సమీపంలో శంకుస్థాపన జరగనుంది.
ఈ చారిత్రాత్మక ఘట్టంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ పాల్గొని భూమి పూజ చేయనున్నారు. ఈ కార్యక్రమానికి గూగుల్ క్లౌడ్ సీఈవో థామస్ కురియన్ స్వయంగా హాజరుకావడం విశేషం. గూగుల్ వంటి అంతర్జాతీయ సంస్థ ఏపీని తన పెట్టుబడి గమ్యస్థానంగా ఎంచుకోవడం రాష్ట్ర పారిశ్రామిక వృద్ధికి నిదర్శనంగా నిలుస్తోంది. విశాఖపట్నం పరిసర ప్రాంతాల్లోని మూడు కీలక ప్రదేశాల్లో ఈ డేటా సెంటర్ల ఏర్పాటుకు ప్రభుత్వం భూములను కేటాయించింది. ఇక్కడ ప్రపంచ స్థాయి క్లౌడ్ మౌలిక సదుపాయాలు , డేటా స్టోరేజ్ వసతులను గూగుల్ అభివృద్ధి చేయనుంది. ఈ భారీ పెట్టుబడి ద్వారా వేలాది మంది స్థానిక యువతకు ఐటీ, అనుబంధ రంగాలలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.
Also Read:BSNL Rs.1 Plan: రూ.1 ప్లాన్ తీసుకొచ్చిన బీఎస్ఎన్ఎల్.. ఆఫర్ అదిరిపోయిందిగా.. నెల రోజుల పాటు ఫ్రీ..
రాష్ట్రానికి చేకూరే ప్రయోజనం..
గూగుల్ డేటా సెంటర్ రాకతో విశాఖ నగరం ‘సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఏపీ’గా అవతరించనుంది. డేటా సెంటర్ల ఏర్పాటు ద్వారా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), డేటా అనలిటిక్స్, క్లౌడ్ కంప్యూటింగ్ రంగాల్లో ఏపీ అగ్రగామిగా నిలిచే అవకాశం ఉంది. ఇది కేవలం గూగుల్కే కాకుండా.. మరిన్ని అంతర్జాతీయ టెక్ కంపెనీలు ఆంధ్రప్రదేశ్ వైపు చూసేలా ప్రోత్సహిస్తుంది. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తక్కువ కాలంలోనే ఇంతటి భారీ పెట్టుబడిని ఆకర్షించడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.