
తెలంగాణ పల్లె వాతావరణం.. ఓ ఒంటరి వృద్ధ తండ్రి.. పట్టించుకోని కొడుకు.. ఓ చిన్న టూత్ బ్రష్.. చివరికి కోర్టు వరకు వెళ్లిన వివాదం.. వినడానికి కాస్త వెరైటీగా అనిపిస్తున్నా.. ఇదే కాన్సెప్ట్తో ప్రేక్షకుల ముందుకొచ్చిన చిత్రం ‘పళ్ళ బురుసు’. అన్నపూర్ణ స్టూడియోస్, ఎపిక్ స్టూడియోస్ నిర్మించిన ఈ సినిమాకు ఉదయ్ చౌహాన్ రచన, దర్శకత్వం వహించారు. సుధాకర్ రెడ్డి, మురళీధర్ గౌడ్, గోమతి, ప్రజ్వల్ యాద్మ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. పవన్ సీహెచ్ సంగీతం అందించగా.. వినోద్ కె. బంగారి సినిమాటోగ్రఫీ బాధ్యతలు చేపట్టారు. ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరి సినీ ప్రియులను ఏ మేరకు మెప్పించిందో చూద్దాం..
కథేంటంటే?
తెలంగాణలోని ఓ పల్లెటూరిలో శంభు (సుధాకర్ రెడ్డి) అనే వృద్ధుడు ఒంటరిగా జీవిస్తుంటాడు. పంటినొప్పితో ఆస్పత్రికి వెళ్లిన అతడికి డాక్టర్ మందులతో పాటు టూత్ బ్రష్ వాడమని సూచిస్తుంది. దీంతో తన కొడుకు తిరుపతి (మురళీధర్ గౌడ్)ను ఓ పళ్ళ బురుసు కొనివ్వమని అడుగుతాడు. చిన్న కోరికే కదా అని అనిపిస్తుంది. కానీ.. కొడుకు మాత్రం తన సమస్యల్లో తాను మునిగిపోయి తండ్రి మాటను పట్టించుకోడు.
అదే సమయంలో తనను పిలవకుండానే మనవరాలి పెళ్లి జరిపించడంతో శంభు తీవ్రంగా అవమానానికి గురవుతాడు. దీంతో ‘పళ్ళ బురుసు’ వ్యవహారాన్ని పట్టుకుని కొడుకుపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తాడు. అక్కడితో ఆగని గొడవ కోర్టు మెట్లెక్కుతుంది. అసలు ఓ టూత్ బ్రష్ కోసం తండ్రి కొడుకుపై కేసు వేయడం వెనుక ఉన్న అసలు కారణమేంటి? తిరుపతికి తండ్రిపై అంత కోపం ఎందుకు? శంభు తన సమాధిని తానే ఎందుకు సిద్ధం చేసుకున్నాడు? కోర్టు తీర్పు ఎవరికి అనుకూలంగా వచ్చింది? వీటికి సమాధానమే సినిమా అసలు కథ.
సినిమా ఎలా ఉంది?
దర్శకుడు ఎంచుకున్న పాయింట్ మాత్రం ఆసక్తికరంగా ఉంది. ఒక చిన్న వస్తువు చుట్టూ తండ్రీకొడుకుల మధ్య దూరం, వృద్ధాప్యంలోని ఒంటరితనం, పిల్లల నిర్లక్ష్యం, కుటుంబ బంధాల విలువ వంటి అంశాలను చెప్పే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా వృద్ధ తల్లిదండ్రులకు చివరి దశలో అవసరమయ్యేది డబ్బు మాత్రమే కాదు.. కాస్త ఆప్యాయత, పలకరింపు, తోడు అనే విషయాన్ని సినిమా గుర్తు చేస్తుంది.
అయితే ఈ బలమైన ఆలోచనను తెరపైకి తీసుకురావడంలో దర్శకుడు పూర్తిస్థాయిలో సక్సెస్ కాలేకపోయారన్న సినీ ప్రియుల నుంచి అభిప్రాయం వ్యక్తం అవుతోంది. కథలోని ప్రధాన సంఘర్షణ బలంగా ఎస్టాబ్లిష్ కాకపోవడంతో ఫస్ట్ హాఫ్ కొన్ని చోట్ల నెమ్మదిగా సాగుతుంది. రవి (ప్రజ్వల్), రేఖ (గోమతి)ల లవ్ట్రాక్, పెళ్లి ఎపిసోడ్ కథకు పెద్దగా జోష్ లేదని పబ్లిక్ టాక్..
ఇక సెకండాఫ్లో కోర్టు డ్రామా, భూమి పంచాయితీ చుట్టూ కథ తిరుగుతుంది. ఈ సన్నివేశాల్లో మరింత బలమైన డ్రామా ఆశించినా.. కొన్ని చోట్ల సిల్లీగా అనిపిస్తాయని సగటు ప్రేక్షకుడు తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా తండ్రీకొడుకుల మధ్య ఉన్న అసలు విభేదాన్ని మరింత లోతుగా చూపించి ఉంటే కథకు మంచి బలం వచ్చేదంటున్నారు. అయితే క్లైమాక్స్ మాత్రం సినిమాకు ఊహించని బలాన్ని ఇస్తుంది. శంభు కేసు వెనుక ఉన్న అసలు కారణం బయటపడే సమయంలో భావోద్వేగం పీక్స్కు చేరుతుంది. చివరి ఘట్టాల్లో సుధాకర్ రెడ్డి నటన సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది.
నటీనటుల పెర్ఫార్మెన్స్..
శంభుగా సుధాకర్ రెడ్డి సహజమైన నటనతో ఆకట్టుకున్నారు. ముఖ్యంగా క్లైమాక్స్లో ఆయన హావభావాలు ప్రేక్షకుల్ని కదిలిస్తాయి. కొడుకుగా మురళీధర్ గౌడ్ కూడా తన పాత్రకు న్యాయం చేశారు. కొన్ని సన్నివేశాల్లో ఆయన ఎక్స్ప్రెషన్స్ నవ్వులు తెప్పిస్తాయి. ప్రజ్వల్ యాద్మ, గోమతి పాత్రలు పరిమితంగానే ఉంటాయి. శంభు చుట్టూ ఉండే స్నేహితుల గ్యాంగ్ కనిపించినా కథకు పెద్దగా ఉపయోగపడదు. పవన్ సీహెచ్ సంగీతం సినిమాకు చక్కగా సరిపోగా.. వినోద్ కె. బంగారి తెలంగాణ పల్లె అందాలను సహజంగా ఆవిష్కరించారు. నిర్మాణ విలువలు కూడా కథకు తగ్గట్టుగా ఉన్నాయి.
మొత్తానికి ఈ ‘పళ్ళ బురుసు’ ఆలోచనలో కొత్తదనం ఉంది. వృద్ధ తల్లిదండ్రుల ఒంటరితనం, పిల్లల నిర్లక్ష్యం వంటి సున్నితమైన అంశాన్ని టూత్ బ్రష్ అనే చిన్న పాయింట్తో చెప్పాలనుకోవడం ఆసక్తికరంగా ఉందంటున్నారు.. కానీ బలమైన కథనం, లోతైన తండ్రీకొడుకుల సంఘర్షణ లేకపోవడంతో సినిమా పూర్తిస్థాయిలో మెప్పించలేకపోయిందన్న టాక్ ను సొంతం చేసింది.. అయితే క్లైమాక్స్, సుధాకర్ రెడ్డి నటన మాత్రం గుర్తుండిపోతాయన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు సినీ ప్రియులు..