Reading Time: < 1 minute
Murmu Students Protests Exam System Reforms Neet Paper Leak

విద్యార్థుల ఆందోళనలపై తొలిసారి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము స్పందించారు. స్వాతంత్ర్య దినోత్సవానికి ముందు దేశ ప్రజలను ఉద్దేశించి చేసిన ప్రసంగంలో విద్యార్థుల సమస్యలపై కీలక వ్యాఖ్యలు చేశారు. దేశ భవిష్యత్‌ను నిర్మించేవారు విద్యార్థులేనని.. యువతను రక్షించడంతో పాటు వారికి న్యాయమైన, సురక్షితమైన పరీక్షా వ్యవస్థ అందించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. పరీక్షా విధానంలో సంస్కరణలు రాబోతున్నట్లుగా తెలిపారు.

‘‘మన విద్యార్థులే భారత భవిష్యత్తును నిర్మించేవారు. జాతీయ భద్రత కోసం ప్రభుత్వం, సమాజం ఐక్యంగా ఉండటం ఎంత అవసరమో.. విద్యార్థుల వర్తమానం, భవిష్యత్తును కాపాడేందుకు కూడా అందరూ సమష్టిగా కృషి చేయడం అంతే అవసరం’’ అని అన్నారు. ప్రభుత్వ పరీక్షా వ్యవస్థలో సమగ్ర మార్పులు తీసుకొచ్చేందుకు చర్యలు చేపడుతోందని తెలిపారు. ముఖ్యంగా పబ్లిక్ పరీక్షల్లో అక్రమ పద్ధతులు, మోసాలను అరికట్టడం, పరీక్షల ప్రక్రియను మరింత పారదర్శకంగా, సురక్షితంగా, విశ్వసనీయంగా మార్చడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని చెప్పారు.

ఇటీవల పరీక్షల నిర్వహణ, ప్రశ్నపత్రాల భద్రత, పరీక్షల్లో అక్రమాలకు సంబంధించిన అంశాలపై విద్యార్థుల నుంచి ఆందోళనలు, నిరసనలు వ్యక్తమైన నేపథ్యంలో రాష్ట్రపతి వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. విద్యార్థుల భవిష్యత్తును కాపాడటం ప్రభుత్వం, సమాజం ఉమ్మడి బాధ్యత అని స్పష్టం చేసిన ముర్ము.. యువతకు నమ్మకమైన పరీక్షా వాతావరణాన్ని కల్పించేందుకు సంస్కరణలు అవసరమని పేర్కొన్నారు.

నీట్ లీకేజీకి వ్యతిరేకంగా ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర విద్యార్థులు ఆందోళన చేపట్టారు. దీంతో విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సి వచ్చింది. ఇక లీకేజీలు అరికట్టేందుకు కేంద్రం కఠినమైన బిల్లును కూడా తీసుకొచ్చింది.