Reading Time: 2 minutes
మన త్రివర్ణానికి ఇంత దగ్గరగా ఉన్న జెండాలు.. ప్రపంచంలో ఎక్కడున్నాయో తెలుసా?

భారతదేశానికి త్రివర్ణ పతాకం కేవలం జాతీయ చిహ్నం మాత్రమే కాదు.. దేశ స్వాతంత్ర్య పోరాటం, విలువలు, ఆదర్శాలకు ప్రతీక. కాషాయం, తెలుపు, ఆకుపచ్చ రంగులతో పాటు మధ్యలో నీలిరంగు అశోక చక్రంతో భారత జెండా ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకుంది. అయితే ప్రపంచంలోని మరికొన్ని దేశాల జెండాల్లోనూ ఇదే రంగులు కనిపిస్తాయి. కొన్ని జెండాలు భారత త్రివర్ణాన్ని ఎంతగానో పోలి ఉండటంతో.. దూరం నుంచి చూస్తే ఏ దేశ జెండానో గుర్తించడం కష్టంగా ఉంటుంది.

ఐర్లాండ్ జెండా

Ireland

Ireland

భారత త్రివర్ణాన్ని పోలిన జెండాల్లో ఐర్లాండ్ జెండా ప్రముఖంగా చెప్పుకోవచ్చు. ఇందులో ఆకుపచ్చ, తెలుపు, నారింజ రంగులు ఉంటాయి. అయితే భారత జెండాతో పోలిస్తే దీని రూపకల్పన పూర్తిగా భిన్నం. భారత జెండాలో మూడు రంగులు అడ్డంగా ఉంటే.. ఐర్లాండ్ జెండాలో నిలువుగా ఉంటాయి. ఐర్లాండ్ జెండాలో ఎడమవైపు ఆకుపచ్చ, మధ్యలో తెలుపు, కుడివైపు నారింజ రంగు ఉంటాయి. భారతదేశంలో ఉపయోగించే కాషాయం రంగుకు ఐర్లాండ్‌లోని నారింజ రంగు దగ్గరగా కనిపిస్తుంది.

ఐవరీ కోస్ట్

Ivory Coast Flag

Ivory Coast Flag

ఐవరీ కోస్ట్ జెండా కూడా ఐర్లాండ్ జెండాను పోలి ఉంటుంది. అయితే రంగుల క్రమం తారుమారుగా ఉంటుంది. ఎడమవైపు నారింజ, మధ్యలో తెలుపు, కుడివైపు ఆకుపచ్చ రంగులు ఉంటాయి. మూడు నిలువు చారలతో రూపొందించిన ఈ జెండా 1959 డిసెంబర్ 3న అధికారికంగా స్వీకరించడం జరిగింది. భారత త్రివర్ణంతో పోలిక ప్రధానంగా నారింజ, తెలుపు, ఆకుపచ్చ రంగుల వల్లే కనిపిస్తుంది.

నైజర్ జెండా.. అచ్చం త్రివర్ణంలానే!

Niger Flag

Niger Flag

భారత జెండాను అత్యంత దగ్గరగా పోలి కనిపించే జెండాల్లో ఆఫ్రికా దేశమైన నైజర్‌ జెండా ఒకటి. ఇందులోనూ మూడు అడ్డ పట్టీలు ఉంటాయి. పైభాగంలో నారింజ, మధ్యలో తెలుపు, కింది భాగంలో ఆకుపచ్చ రంగులు ఉంటాయి. అయితే మధ్యలో ఉన్న తెలుపు పట్టీలో నీలి అశోక చక్రం స్థానంలో నారింజ రంగు వృత్తం ఉంటుంది. అదే ఈ రెండు జెండాల మధ్య ప్రధాన తేడా. దూరం నుంచి చూస్తే మాత్రం రెండు జెండాలూ దాదాపు ఒకేలా కనిపించే అవకాశం ఉంది.

అసలు ఈ రంగులే ఎందుకు?

ప్రపంచంలోని అనేక దేశాలు త్రివర్ణ పతాకాలను ఎంచుకోవడానికి చారిత్రక కారణాలున్నాయి. 18, 19వ శతాబ్దాల్లో జరిగిన విప్లవాలు, ముఖ్యంగా ఫ్రెంచ్ విప్లవం తర్వాత త్రివర్ణ పతాకాల ఆలోచన ప్రపంచవ్యాప్తంగా ప్రభావం చూపింది. జాతీయ ఉద్యమాలు, స్వాతంత్ర్య పోరాటాల సమయంలో అనేక దేశాలు మూడు రంగుల జెండాలను స్వీకరించాయి.

Indian Tricolor National Flag

Indian Tricolor National Flag

భారత త్రివర్ణ పతాకం కూడా స్వాతంత్ర్య ఉద్యమ కాలంలో రూపుదిద్దుకుంది. కాషాయం ధైర్యం, త్యాగానికి.. తెలుపు సత్యం, శాంతికి.. ఆకుపచ్చ అభివృద్ధి, శ్రేయస్సుకు ప్రతీకలుగా భావిస్తారు. మధ్యలోని అశోక చక్రం ధర్మం, నిరంతర చలనానికి ప్రతీకగా నిలుస్తుంది. భారత జెండా ప్రస్తుత రూపాన్ని పింగళి వెంకయ్య రూపొందించగా, 1947 జూలై 22న రాజ్యాంగ సభ ఆమోదించింది.

అందుకే రంగులు పోలినప్పటికీ.. ప్రతి దేశ జెండా వెనుక దాని స్వంత చరిత్ర, సంస్కృతి, జాతీయ భావోద్వేగాలు ఉన్నాయి. భారత త్రివర్ణం మాత్రం అశోక చక్రంతో ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకుంది.

మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..