
హైదరాబాద్ లో దారుణం జరిగింది. కాలేజీ ఫీజు చెల్లించలేదని హాల్ టికెట్ ఇవ్వకపోవడంతో బీటెక్ స్టూడెంట్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆదివారం ( ఏప్రిల్ 19 ) జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి…జగిత్యాల జిల్లా, గొల్లపల్లి మండల కేంద్రానికి చెందిన మ్యాదరి ప్రణీత్ కుమార్ (22) హయత్ నగర్ పరిధిలోని శ్రీ ఇందూ కాలేజీలో బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతున్నాడు.
పరీక్షల సమయంలో ఫీజు చెల్లించలేదని కాలేజీ యాజమాన్యం హాల్ టికెట్ ఇవ్వకపోవడంతో మనస్థాపానికి చెందిన ప్రణీత్ శనివారం రాత్రి సీలింగ్ ఫ్యాన్ కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.
సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని.. పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి… దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు హయత్ నగర్ పోలీసులు.