
హార్ముజ్ జలసంధిని పూర్తిగా తెరిచామని ఇరాన్ ప్రకటించిన కొద్ది గంట్లలోనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. ఇరాన్ తెరిచినా ఒప్పందం ప్రకారం మా లావాదేవీలు పూర్తయ్యాకే హార్ముజ్ జలసంధి ద్వారా పూర్తి స్థాయిలో నౌకల రాకపోకలు జరుగుతాయని చెప్పారు. హార్ముజ్ జలసంధి రాకపోకలకు తెరిచి ఉందని ఇరాన్ చేసిన ప్రకటనను స్వాగతిస్తూనే ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు.
‘‘హార్ముజ్ జలసంధి ప్రస్తుతం పూర్తిగా తెరిచి ఉంది..వాణిజ్య కార్యకలాపాలు,నౌకల పూర్తి రాకపోకలకు సిద్ధంగా ఉంది. అయితే, ఇరాన్తో మా లావాదేవీలు 100% పూర్తయ్యేంత వరకు కేవలం ఇరాన్కు సంబంధించి మాత్రమే నౌకాదళ దిగ్బంధనం పూర్తి స్థాయిలో అమలులో కొనసాగుతుంది. ఇరాన్ తో ఈవిషయంపై చాలా అంశాల్లో చర్చలు విజయవంతం అయ్యాయి. ఈ ప్రక్రియ చాలా వేగంగా పూర్తవుతుందని ఆశిస్తున్నాను’’ అంటూ ట్రంప్ ట్రూత్ సోషల్ పోస్ట్ చేశారు.
హార్ముజ్ జలసంధిలో చమురు నౌకలు రాకపోకలపై ఇరాన్ శుక్రవారం(ఏప్రిల్ 17) ఉదయం కీలక ప్రకటన చేసింది. హార్ముజ్ జలసంధిని పూర్తిగా తెరిచామని చమురు నౌకల రాకపోకలు కొనసాగుతున్నాయని ఇజ్రాయెల్, లెబనాన్ కాల్పుల విమరణతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది. ఇజ్రాయెల్, లెబనాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగిన తర్వాత హార్ముజ్ తెరిచేందుకు ఇరాన్ ముందుకు వచ్చింది.కాల్పుల విరమణ కాలంలో హార్ముజ్ జలసంధి పూర్తిగా తెరిచి ఉంటుందని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ సోషల్ మీడియా ప్లాట్ ఫాం X ద్వారా తెలిపారు. ఇరాన్ ప్రకటనతో భారత్ తోపాటు చమురు కష్టాలను ఎదుర్కొంటున్న ప్రపంచ దేశాలకు భారీ ఊరట లభించనుంది.
ప్రపంచ చమురు రవాణా మార్గాలలో హార్ముజ్ అత్యంత కీలకమైన సముద్ర మార్గం. ఈ జలసంధి ద్వారా ఎక్కువ భాగం చమురు, గ్యాస్ రవాణా జరుగుతోంది. ఇరాన్ ప్రకటనతో ప్రపంచ ఇంధన మార్కెట్లకు భారీ ఊరట లభించనుంది. చమురు ధరలు భారీగా తగ్గే అవకాశం కనిపిస్తోంది.