
- పెరిగిన వేడి గాలుల తీవ్రత..ఎక్కడా 40కి తగ్గలే..
హైదరాబాద్ సిటీ, వెలుగు: హైదరాబాద్ నగరంలో ఎండలు దంచికొడుతున్నాయి. నగరంలో దాదాపు అన్ని ప్రాంతాల్లో 40 డిగ్రీలపైనే ఉష్ణోగ్రతలు నమోదవుతూ హడలెత్తిస్తున్నాయి. గురువారం నగరంలోని ఆర్సీ పురంలో అత్యధికంగా 42.3 డిగ్రీల సెల్సియస్ టెంపరేచర్నమోదు కాగా, ఆసిఫ్నగర్, హిమాయత్నగర్ ప్రాంతాల్లో 42 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇక మలక్పేట్, బేగంపేట్ లో 41.9 , సరూర్నగర్, చాంద్రాయణగుట్ట, గోషామహల్, మియాపూర్ లో 41.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.
మూసాపేట్, జూబ్లీహిల్స్ ప్రాంతాల్లో 41.7, సంతోష్నగర్ 41.6, ఉప్పల్, కూకట్పల్లి, హయత్నగర్ ప్రాంతాల్లో 41.5 నమోదు కాగా, లింగంపల్లి 41.4, కుత్బుల్లాపూర్, మల్కాజిగిరి ప్రాంతాల్లో 41.3 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాబోయే 2 నుంచి 3 రోజుల పాటు ఇదే విధంగా ఎండల తీవ్రత కొనసాగుతుందని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించింది.
రెండు రోజుల్లో వానలు
ఒకవైపు ఎండలు దంచి కొడుతూ జనాలు చెమటలు కక్కుతుంటే వాతావరణశాఖ ‘చల్లటి’ వార్త చెప్పింది. ఎండల తీవ్రత రెండు, మూడు రోజుల పాటు ఉంటుందని, తర్వాత ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రకటించింది.