
ప్రస్తుత అంతర్జాతీయ పరిణామాల మధ్యన రష్యా ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. పశ్చిమాసియాలో అమెరికా-ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలు, ఇంధన సంక్షోభం కారణంగా ఏప్రిల్ 1, 2026 నుండి పెట్రోల్ ఎగుమతులపై నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించింది. అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరల హెచ్చుతగ్గులను అరికట్టడానికి.. తమ దేశీయ అవసరాలకు ఎటువంటి కొరత రాకుండా చూడటానికి ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు రష్యా ఉప ప్రధాని అలెగ్జాండర్ నోవాక్ వెల్లడించారు. రష్యా గతంలో కూడా ధరలను నియంత్రించడానికి ఇలాంటి ఆంక్షలు విధించిన సందర్భాలు ఉన్నాయి.
రష్యా తీసుకున్న ఈ నిర్ణయం భారత్పై ఎలాంటి ప్రభావం చూపుతుందనే ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది. అయితే ఇంధన రంగ నిపుణుల విశ్లేషణ ప్రకారం భారత్కు దీనివల్ల తక్షణ ముప్పు ఏమీ లేదని తేలింది. ఎందుకంటే భారతదేశం రష్యా నుంచి నేరుగా పెట్రోల్ లేదా డీజిల్ వంటి రిఫైన్డ్ ఇంధనాలను దిగుమతి చేసుకోదు. మనం కొనేది కేవలం క్రూడ్ ఆయిల్ మాత్రమే. సో రష్యా తీసుకున్న తాజా నిర్ణయంతో ఇండియాపై దాదాపు ఎలాంటి ఎఫెక్ట్ ఉండని నిపుణులు చెబుతున్నారు. మన దేశానికి కావాల్సిన ముడి చమురు అవసరాల్లో దాదాపు 80 శాతం దిగుమతుల ద్వారానే తీరుతుండగా.. అందులో రష్యా వాటా సుమారు 20 శాతంగా ఉంది.
ALSO READ : వాళ్లు ఎంట్రీ ఇస్తే గోల్డ్ రేట్లు మళ్లీ పెరుగుతాయా..?
భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద రిఫైనింగ్ హబ్లలో ఒకటని తెలిసిందే. మన దేశానికి రోజుకు సుమారు 5.6 మిలియన్ బారెళ్ల క్రూడ్ ఆయిల్ శుద్ధి చేసే సామర్థ్యం ఉంది. అంటే మనం విదేశాల నుంచి ముడి చమురును తెచ్చుకుని.. మన దేశీయ రిఫైనరీలలోనే పెట్రోల్, డీజిల్గా మారుస్తాము. మన అవసరాలకు పోను మిగిలిన ఇంధనాన్ని ఇతర దేశాలకు ఎగుమతి చేసే స్థాయిలో భారత్ ఉంది. కాబట్టి రష్యా కేవలం పెట్రోల్ ఎగుమతులపైనే నిషేధం విధించింది కాబట్టి.. ముడి చమురు సరఫరాలో అంతరాయం లేనంత వరకు భారత్లో పెట్రోల్ అమ్మకాలపై ఈ నిర్ణయం నేరుగా ప్రభావం చూపబోదు.