Reading Time: 2 minutes

దుబాయ్: ఓ వైపు ట్రంప్ ఇరాన్‌తో చర్చలు పురోగతిలో ఉన్నాయని చెపుతున్నా , క్షేత్రస్థాయి పరిస్థితి భిన్నంగా ఉంది. వాస్తవికంగా శాంతిప్రతిపాదనల ఫార్మూలాపై ఇటు అమెరికా, అటు ఇరాన్ తమ పట్టువీడని ధోరణినే కనబరుస్తున్నాయి. మరో వైపు ఇరాన్‌కు మరింత సవాలు విసురుతూ అమెరికా గల్ఫ్ ఇతర ప్రాంతాలలోకి వేలాదిగా అ దనపు సైనిక బలగాలను తరలిస్తోంది. పలు యు ద్ధ నౌకలు హర్మూజ్ జలసంధి వద్దకు చేరాయి. ఇజ్రాయెల్ ఇప్పటి చర్చల విషయంతో తమకు ని మిత్తం లేదన్నట్లుగా వ్యవహరిస్తోంది. సదర్న్ లెబనాన్‌లోని ఇరాన్ మద్దతు గల హెజ్బోల్లా మిలిటెంట్ల బృందాల నిర్మూలనకు మరిన్ని బలగాలను తరలించింది.

హర్మూజ్ మార్గానికి ఉన్న ప్రాధాన్యత నేపథ్యంలో ఇరాన్ ఈ మార్గంలో తన పట్టు బిగించింది. కేవలం మిత్రదేశాలనే ఈ మార్గం ద్వారా అనుమతిస్తోంది. ఇజ్రాయెల్‌లోని పలు ప్రాంతాల్లో ఇరాన్ క్షిపణి దాడులు సాగుతూనే ఉన్నాయి. ఇరాన్ రాజధాని టెహరాన్‌పై ఇజ్రాయెల్ దాడులను చేస్తూనే ఇరాన్ క్షిపణులను , డ్రోన్లను దెబ్బతీసేందుకు తమ గగనతల వలయాన్ని పటిష్టపర్చుకుంది. ఇరాన్ దాడులను సమర్థవంతంగా తిప్పికొట్టేందుకు, చమురు నష్టం నివారణకు గల్ప్‌దేశాలు అన్ని కూడా అనుక్షణ నిఘాతో వ్యవహరిస్తున్నాయి. శుక్రవారం టెహరాన్ ఇతర నగరాలలో ఇజ్రాయెల్ దాడులు తీవ్రతరం అయ్యాయి.

ఇరాన్‌పై తమ దాడులు నిర్విరామంగా సాగుతాయని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కట్జ్ ప్రకటించారు. ఇజ్రాయెల్‌లో ప్రజల నివాస ప్రాంతాలపై దాడులు నిలిపివేయాలని , లేకపోతే తీవ్ర పరిణామాలు తప్పవని తాము, ప్రధాని నెతన్యాహూ ఇరాన్‌కు హెచ్చరికలు వెలువరిస్తున్నామని గుర్తు చేశారు. ఇకనైనా ఇరాన్ ఉగ్రవాద పాలకపక్షం విధ్వంస చర్యలకు దిగకుండా ఉంటే మంచిదని కట్జ్ స్పష్టం చేశారు. తాము హెచ్చరిస్తూ వస్తున్నా, ఇరాన్ వైఖరిలో మార్పు రావడం లేదని, దీనితో ఇక తమ పోరు మరింత విస్తరించుకుంటామని, ఇరాన్‌లోని పలు కొత్త ప్రాంతాలను లక్షం చేసుకుని తీరుతామని వెల్లడించారు. ఇజ్రాయెల్ శుక్రవారం టెహ్రాన్ నడిబొడ్డున నిర్ణీత ప్రాంతాలను ఎంచుకుని దాడులకు దిగింది. ఆయా ప్రాంతాలలో ఇరాన్ బాలిస్టిక్ మిస్సైల్ తయారీ కేంద్రాలు , అధునాతన ఆయుధాల కర్మాగారాలు ఉన్నాయని నిర్థారించుకుని ఈ దాడులు జరిపారు. ఇరాన్ పశ్చిమ ప్రాంతంలో తమ సేనలు అక్కడి ఇరాన్ మిస్సైల్ లాంఛర్లు, గిడ్డంగులను ఎంచుకుని దాడులకు దిగాయి. ఇక లెబనాన్‌లోని బీరూట్‌పై దాడులు జరిగాయి. ఈ క్రమంలో అక్కడ పెద్ద ఎత్తున మంటలు దట్టమైన పొగ కమ్ముకుంది.

గల్ఫ్‌పై ఆగని ఇరాన్ దాడులు.. సైరన్ల మోత

గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడులు తీవ్రతరం అయ్యాయి. బహరైన్, ఖతార్, యుఎఇలలో సైరన్ల మోతతో జనం వణికిపోయారు. రియాద్ వైపు దూసుకువచ్చిన ఇరాన్ డ్రోన్లు, మిస్సైల్స్‌రు తాము కూల్చివేసినట్లు సౌదీ అరేబియా రక్షణ మంత్రిత్వశాఖ ప్రకటించింది. సౌదీ రాజధాని రియాద్‌ను గురిచేసుకుని ఇరాన్ శుక్రవారం దాడులు విస్తృతం చేసింది. కువైత్‌లోని కువైత్ సిటి అనుబంధ షువైక్ పోర్టు, ఉత్తరాన ఉన్న ముబారక్ అల్ కబీర్ పోర్టు ఇరాన్ దాడులలో దెబ్బతిన్నాయి. ఇందులో కబీర్ పోర్టును చైనా నిర్మాణపు బెల్ట్ అండ్ రోడ్ ఏర్పాటు క్రమంలో నిర్మిస్తున్నారు. ఇక్కడ పెద్ద ఎత్తున నిర్మాణ సామాగ్రి దెబ్బతింది.

టెహరాన్‌లో పాక్ ఎంబసీ వద్ద దాడులు

శుక్రవారం టెహరాన్‌పై ఇజ్రాయెల్ దాడుల క్రమంలో అక్కడి పాకిస్థాన్ దౌత్యకార్యాలయం వద్ద వైమానిక దాడి జరిగింది. ఈ ఘటనలో పాక్ ఎంబసీకి ఎటువంటి నష్టం జరగలేదు. అధికారులు ,సిబ్బందికి కూడా ఎటువంటి హానీ జరగలేదు. అయితే ఈ ఘటనపై వెంటనే పాకిస్థాన్ తీవ్రస్థాయిలో ఇజ్రాయెల్‌కు హెచ్చరికలు వెలువరించింది. తమ దేశాన్ని ఖతార్ అనుకోరాదని, ప్రపంచంలో ఎక్కడైనా తమ దౌత్యసిబ్బందికి,ఆస్తులకు నష్టం జరిగితే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించారు. ఇజ్రాయెల్ దాడులలో దౌత్యకార్యాలయం సమీపంలోని పలుభవనాలు దెబ్బతిన్నాయి. ఇరాన్, అమెరికా మధ్య శాంతికి పాకిస్థాన్ మధ్యవర్తిత్వం వహిస్తోందనే వార్తలు నేపథ్యంలో ఇక్కడ ఈ దాడి జరిగింది. అయితే ఈ ఘటనపై అమెరికా కానీ, ఇజ్రాయెల్ కానీ స్పందించలేదు.