
పరిగి: వికారాబాద్ జిల్లా పరిగి మండలం లక్ష్మీదేవిపల్లి సమీపంలోని సుగుణ స్టీల్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు సంభవించింది. ఫ్యాక్టరీలోని బట్టి ఒక్కసారిగా పేలడంతో పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడ్డాయి. ప్రమాదం జరిగిన వెంటనే ఫ్యాక్టరీ పరిసరాల్లో దట్టమైన పొగ కమ్ముకోవడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఈ పేలుడు ధాటికి లోపల పనిచేస్తున్న పలువురు కార్మికులకు తీవ్ర గాయాలైనట్లు సమాచారం అందుతోంది. అయితే, ఈ ప్రమాదం పై కంపెనీ యాజమాన్యం ఎలాంటి సమాచారం ఇవ్వడం లేదు. భారీ పేలుడు జరిగినా కూడా కేవలం లారీ టైర్ పేలిందని చెబుతూ కంపెనీ ప్రతినిధులు బుకాయిస్తున్నారు. అసలు ఏం జరిగిందో తెలుసుకునేందుకు లోపలికి అనుమతించకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. గాయపడిన కార్మికులను రహస్యంగా ఆసుపత్రికి తరలించారా అన్న కోణంలో చర్చ జరుగుతోంది. ఇప్పటికే ఇదే ఫ్యాక్టరీ వద్ద గతంలో గంజాయి విక్రయిస్తున్న ఇతర రాష్ట్రాల కూలీలను ఎక్సైజ్ పోలీసులు పట్టుకున్న ఘటన మరువకముందే, ఇప్పుడు ఈ పేలుడు సంభవించడం కలకలం రేపుతోంది.