Reading Time: < 1 minute

న్యూఢిల్లీ: త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 2026 మెగా టోర్నమెంట్ కు ముందు రాజస్థాన్ రాయల్స్ ..జట్టులో కీలక మార్పు చేసింది. గాయపడిన ఇంగ్లండ్ ఆల్ రౌండర్ సామ్ కరన్ స్థానంలో శ్రీలంక స్టార్ ఆల్ రౌండర్ దసున్ శనకను జట్టులోకి ఎంపిక చేసింది. శనకను రూ.2కోట్లకు తీసుకుంది.

గతంలో గుజరాత్ టైటాన్స్‌కు ఆడిన శనక.. తన అనుభవంతో రాజస్థాన్ మిడిల్ ఆర్డర్‌ను బలోపేతం చేస్తాడని రాజస్థాన్ ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. కాగా శనక.. శ్రీలంక తరఫున 6 టెస్టులు, 71 వన్డేలు, 131 టీ20లు ఆడాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో 3350కి పైగా పరుగులు, 86 వికెట్లు ఉన్నాయి. 

ఇదిలావుంటే.. గత డిసెంబర్‌లో జరిగిన ఐపీఎల్ మినీ-వేలంలో శనక అమ్ముడుపోలేదు. దీంతో అతను పాకిస్తాన్ సూపర్ లీగ్ 2026 ఆడేందుకు సిద్ధమయ్యాడు. ఈ క్రమంలో లాహోర్ ఖలందర్స్, శనకను 75 లక్షలకు కొనుగోలు చేసింది. అయితే, ఇప్పుడు పాకిస్తాన్ లీగ్‌ను వదులి మళ్లీ ఐపీఎల్‌లో ఆడేందుకు వస్తున్నాడు. ఐపిఎల్ లో రాజస్థాన్ రాయల్స్‌ జట్టులో చేరనున్నాడు.

మరో విదేశీ ఆటగాడు బ్లెస్సింగ్ ముజరబానీ కూడా పీఎస్ఎల్ లో ఇస్లామాబాద్ యునైటెడ్‌తో తన ఒప్పందాన్ని రద్దు చేసుకుని కోల్‌కతా నైట్ రైడర్స్‌లో చేరాడు.