Reading Time: < 1 minute

ముంబై: మరో వారం రోజుల్లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ మెగా 2026 సీజన్ ప్రారంభంకానుంది. ఈనెల 28న బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సిబి), సన్‌రైజర్స్ హైదరాబాద్(ఎస్‌ఆర్‌హెచ్) జట్ల మధ్య తొలి మ్యాచ్ జరగనుంది. దీంతో ఇప్పటికే ఆయా ఫ్రాంచైజీలు టైటిలే లక్ష్యంగా వ్యూహాలతో బరిలోకి దిగేందుకు సన్నద్ధమయ్యాయి. అయితే ఐపిఎల్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 10 ఫ్రాంచైజీలు భారత కెప్టెన్లతోనే బరిలోకి దిగుతున్నాయి. ఇలా భారత సారథులతో ఒక సీజన్ ప్రారంభం కావడం 19 ఏళ్లలో ఇదే తొలిసారి. తుది జట్టులో ఆడేది నలుగురే అయినా.. విదేశీ ఆటగాళ్ల ప్రభావం ఈ లీగ్‌పై ఎక్కువ. పలువురు విదేశీ ఆటగాళ్లు కెప్టెన్లుగా కూడా వ్యవహరించారు. కానీ, ఈ ఒరవడికి చెక్ పెడుతూ తొలిసారి భారత ఆటగాళ్ల సారథ్యంలో 10 ఫ్రాంచైజీలు బరిలోకి దిగుతున్నాయి. అయితే పలువురు విదేశీ కెప్టెన్లు గాయపడటంతో ఇది సాధ్యమైనట్టు తెలుస్తోంది. సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ మోకాలి గాయంతో ఐపిఎల్ ఆరంభ మ్యాచ్‌లకు దూరమయ్యాడు. దాంతో ఇషాన్ కిషన్‌ను తాత్కలిక సారథిగా సన్‌రైజర్స్ నియమించుకుంది. మిగతా 9 జట్లకు భారత ఆటగాళ్లే సారథులు.

10 జట్ల కెప్టెన్లు వీరే..

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు-రజత్ పటీదార్

సన్‌రైజర్స్ హైదరాబాద్ -ఇషాన్ కిషన్

ముంబై ఇండియన్స్ – హార్దిక్ పాండ్యా

కోల్‌కతా నైట్‌రైడర్స్ -అజింక్యా రహానే

పంజాబ్ కింగ్స్ -శ్రేయస్ అయ్యర్

చెన్నై సూపర్ కింగ్స్ -రుతురాజ్ గైక్వాడ్

లక్నో సూపర్ జెయింట్స్ -రిషభ్ పంత్

గుజరాత్ టైటాన్స్ -శుభ్‌మన్ గిల్

రాజస్థాన్ రాయల్స్ -రియాన్ పరాగ్

ఢిల్లీ క్యాపిటల్స్-అక్షర్ పటేల్