
హైదరాబాద్: రంజాన్ పర్వదినం పురస్కరించుకొని తెలంగాణ వ్యాప్తంగా ముస్లింలు ఘనంగా జరుపుకున్నారు. పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా రామగుండం, పెద్దపల్లి, మంథని నియోజకవర్గాల్లోని దర్గాలలో ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. రంజాన్ పర్వదినం విశిష్టతను వివరిస్తూ మత పెద్దలు హితబోధ చేశారు. అదేవిధంగా పేద ముస్లిం కుటుంబాలకు దానధర్మాలు నిర్వహించారు. పండుగ సందర్భంగా ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. రామగుండంలో ఈద్గాల వద్ద జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్, మేయర్ మహంకాళి స్వామి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మైనార్టీల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. అదేవిధంగా బడ్జెట్లో సైతం పెద్ద ఎత్తున మైనార్టీ సంక్షేమానికి ఖర్చు చేస్తున్నామని పేర్కొన్నారు. రంజాన్ పర్వదినం సందర్భంగా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు పెద్దపల్లి డిసిపి రామ్ రెడ్డి తెలిపారు.