Reading Time: < 1 minute

రంగారెడ్డి: అండగా ఉండాల్సిన సోదరుడు అక్క ఆస్తిపై కన్నేసి ఆమెను హత్య చేశాడు. మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా నరికి చెరువులో పడేసిన సంఘటన రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. రాజస్థాన్‌కు చెందిన లీలాదేవీ (40) అనే మహిళ తన భర్త, ఇద్దరు పిల్లలతో కలిసి హైదరాబాద్‌లో నివసిస్తోంది. రంగారెడ్డి జిల్లా ఎల్‌బి నగర్‌లో కిరాణా షాపు నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నారు. 2018లో లీలా దేవి భర్త చనిపోవడంతో బాధ్యతలు ఆమెపై పడ్డాయి. ఆమెకు అండగా ఉంటానంటూ వరసకు సోదరుడు అయ్యే పుష్పరామ్ ముందుకు వచ్చాడు. లీలా దేవి వద్ద డబ్బులు ఉండడంతో తన సోదరుడు పుష్పరామ్‌తో కలిసి అబ్దుల్లాపూర్‌మెంట్ మండలం బాటసింగారంలో 120 గజాల ఇల్లు కొనుగోలు చేశాడు. పుష్పరామ్ తెలివిగా తన పేరిట రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. బాట సింగారంలో లీలాదేవి కిరణాషాపు నిర్వహిస్తున్నారు. తన సోదరుడు పుష్పరామ్ కుటుంబంతో కలిసి లీలాదేవి కలిసి ఉంటుంది. ఆస్తిపై కన్నేసిన పుష్పరామ్ తన సోదరిని చంపాలని నిర్ణయం తీసుకున్నాడు. దుకాణంలో పని చేసే రాజేశ్ కుమావత్, సునీల్ కుమార్‌లతో కలిసి లీలాదేవిని హత్య చేశారు. మృతదేహాన్ని ఇంట్లో గుట్టుగా దాచారు. పాఠశాల నుంచి ఇంటికి వచ్చిన ఆమె పిల్లలు తన తల్లి ఎక్కడికి వెళ్లిందని ప్రశ్నించారు. ఆమె ఎవరితోనే వెళ్లిపోయిందని నిందలు వేశారు. రెండో రోజుల తరువాత మృతదేహాన్ని ముక్కలుగా చేసి చెరువు, తూములో పడేశారు. తన సోదరి లీలాదేవి కనిపించడం లేదని స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరిపారు. వెంటనే అనుమానంలో పుష్పరామ్, రాకేశ్ కుమావత్, సునీల్‌కుమార్‌లను అదుపులోకి తీసుకొని ప్రశ్నించారు. నిందితులు నిజాలు ఒప్పుకోవడంతో వారిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.