Tamil Nadu: “రజనీకాంత్ను బెదిరించిన డీఎంకే”.. విజయ్ పార్టీ కొత్త వివాదం..

Tamil Nadu: తమిళనాడుతో పాటు కేరళ, అస్సాం, వెస్ట్ బెంగాల్, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికలకు ఈసీ షెడ్యూల్ విడుదల చేసేందుక రంగం సిద్ధమైంది. ఇదిలా ఉంటే, తమిళనాడులో మాత్రం ఓ విషయం ఇప్పుడు రాజకీయంగా సంచలనంగా మారింది. సినీ నటుడు విజయ్ కు చెందిన తమిళగా వెట్రి కజగం (TVK) సీనియర్ నాయకుడు ఒకరు చేసిన వ్యాఖ్యలు ఆ రాష్ట్రంలో చర్చనీయాంశమయ్యాయి. సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయాల్లోకి రావాలని ఆలోచించినప్పుడు ద్రవిడ మున్నేట్ర కజగం (DMK) ఆయన్ను బెదిరించిందని ఆరోపించారు.
టీవీకే పార్టీకి ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఆధవ్ అర్జున, మార్చి 12న రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగిన నిరసనలో పార్టీ సభ్యులను ఉద్దేశించి ప్రసంగిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఆయన చేసిన వ్యాఖ్యల తర్వాత డీఎంకే నేతలు, రజనీకాంత్ అభిమానుల నుంచి విమర్శలు వచ్చాయి. ‘‘తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎం.జి. రామచంద్రన్ శకం ముగిసిన తర్వాత, రజనీకాంత్ ఒక ప్రజాదరణ పొందిన రాజకీయ నాయకుడిగా ఎదగాలని, వ్యవస్థాగత మార్పులు తీసుకురావాలని ఆశించారు. కానీ ఇప్పుడు రజనీకాంత్ రెడ్ జాయింట్ సంస్థతో మూవీస్ చేస్తున్నారు’’ అని ఆయన అన్నారు. రెడ్ జాయింట్ సంస్థ స్టాలిన్ కుమారుడు ఉదయనిధి స్టాలిన్కు చెందినది.
అయితే, రజనీకాంత్ను విమర్శించడం తన ఉద్దేశ్యం కాదని, విజయ్ రాజకీయ ధైర్యాన్ని హైలెట్ చేయడమే తన ఉద్దేశ్యమని ఆయన అన్నారు. ఈ వ్యాఖ్యలు తమిళనాట తీవ్ర వివాదాస్పదమయ్యాయి. రజనీకాంత్ మాజీ సలహాదారు ఆర్ అర్జునమూర్తి ఈ వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండించారు. విజయ్ అర్జునపై చర్యలు తీసుకోవాలని కోరారు. తమిళనాడు మంత్రి ఎస్. రేగుపతి కూడా ఆరోపణలను తిరస్కరించారు, టీవీకే తప్పుడు వాదనలను వ్యాప్తి చేయడం ద్వారా రాజకీయ మైలేజ్ పొందడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. రజనీకాంత్ డీఎంకేతో స్నేహపూర్వక సంబంధాలను కొనసాగించారని, 1996 ఎన్నికల్లో పార్టీకి మద్దతు ఇచ్చారని ఆయన అన్నారు.