July 9, 2026

Konda Surekha: ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్ రాజకీయాల్లో విభేదాల చర్చ.. మాజీమంత్రిపై మంత్రి ఫిర్యాదు.!

Konda Surekha: ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్ రాజకీయాల్లో విభేదాల చర్చ.. మాజీమంత్రిపై మంత్రి ఫిర్యాదు.!
Reading Time: 2 minutes
Warangal Congress Politics Minister Konda Surekha Complains Against Kadiyam Srihari To Tpcc Chief

Konda Surekha: ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్ రాజకీయాల్లో మరోసారి విభేదాల చర్చ మొదలైంది. మంత్రి కొండా సురేఖ, మాజీ మంత్రి కడియం శ్రీహరి మధ్య వివాదం మళ్లీ పార్టీ అధిష్టానం దృష్టికి వెళ్లింది. తాజాగా మంత్రి కొండా సురేఖ తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్‌ను కలిసి కడియం శ్రీహరిపై ఫిర్యాదు చేశారు. పీసీసీ చీఫ్‌తో భేటీ సందర్భంగా కడియం శ్రీహరి జిల్లా రాజకీయాల్లో తనను లక్ష్యంగా చేసుకుని వ్యవహరిస్తున్నారని, మహిళా మంత్రిగా తన విధులకు ఆటంకం కలిగిస్తున్నారని కొండా సురేఖ ఫిర్యాదు చేశారు. పార్టీ క్రమశిక్షణ దృష్ట్యా ఆయనపై తగిన చర్యలు తీసుకోవాలని కూడా ఆమె సందర్బంగా విజ్ఞప్తి చేశారు.

మంత్రి సురేఖ విజ్ఞప్తిపై స్పందించిన పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఈ వివాదాన్ని పార్టీ స్థాయిలో పరిష్కరించేందుకు ప్రయత్నిస్తానని హామీ ఇచ్చారు. ఇరువర్గాల అభిప్రాయాలను తెలుసుకుని త్వరలోనే తగిన నిర్ణయం తీసుకుంటామని ఆయన చెప్పినట్లు సమాచారం. కొండా సురేఖ, కడియం శ్రీహరి మధ్య గత కొంతకాలంగా రాజకీయ విభేదాలు కొనసాగుతున్నాయి. ఒకరిపై ఒకరు పార్టీ అధిష్టానానికి ఫిర్యాదులు చేయడం, బహిరంగ విమర్శలు చేసుకోవడం వరకు వ్యవహారం వెళ్లింది. దీంతో కాంగ్రెస్ పార్టీ పెద్దలు జోక్యం చేసుకుని ఇరువర్గాల మధ్య సయోధ్యకు ప్రయత్నించారు.

ఆ తర్వాత నాయిని రాజేందర్ రెడ్డి నివాసంలో జరిగిన విందు సమావేశానికి కొండా సురేఖ హాజరై తమ మధ్య విభేదాలు లేవని, కేవలం అభిప్రాయ భేదాలే ఉన్నాయని ప్రకటించారు. జిల్లా అభివృద్ధి కోసం అందరం కలిసి పనిచేస్తామని కూడా ఆమె స్పష్టం చేశారు. అంతేకాకుండా కడియం శ్రీహరి మనవరాలి హాఫ్ సారీ వేడుకకు కూడా కొండా సురేఖ హాజరై కలిసి ఫొటోలు దిగడంతో ఇరువర్గాల మధ్య వివాదం ముగిసిందని అంతా భావించారు.

తాజా వివాదానికి కారణమేంటి?

అయితే ఇటీవల కడియం శ్రీహరి తన నియోజకవర్గంలోని దేవాలయాల అభివృద్ధి, వాటి సమస్యలపై అధికారులతో సమీక్ష నిర్వహించడం కొత్త వివాదానికి దారితీసినట్లు సమాచారం. సమావేశం అనంతరం ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించిన మాస్టర్ ప్లాన్‌ను సమర్పించాలని అధికారులను కోరినట్లు సమాచారం మంత్రి సురేఖ దృష్టికి వెళ్లినట్లు రాజకీయ వర్గాలు చెబుతున్నాయి.

తన నియోజకవర్గానికి సంబంధించిన అంశాలపై సమీక్ష నిర్వహించడం వరకు సమంజసమే అయినప్పటికీ.. మొత్తం జిల్లా వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం, అధికారులకు సూచనలు ఇవ్వడం ప్రోటోకాల్‌కు విరుద్ధమని మంత్రి సురేఖ భావించినట్లు తెలుస్తోంది. ఇదే అంశంపై పార్టీ పెద్దలతో పాటు ముఖ్యమంత్రికి కూడా ఆమె లేఖ రాశారు.

కడియం శ్రీహరి వివరణ:

ఈ ఆరోపణలపై స్పందించిన కడియం శ్రీహరి మాత్రం తాను కేవలం తన నియోజకవర్గంలోని దేవాలయాల అభివృద్ధి అంశాలపైనే అధికారులతో చర్చించానని తెలిపారు. జిల్లా స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించలేదని స్పష్టం చేశారు. మంత్రి కొండా సురేఖ తనపై ఫిర్యాదు చేశారనే ప్రచారాన్ని కూడా ఆయన కొట్టిపారేస్తూ, అది కేవలం రాజకీయ ప్రచారం మాత్రమే అయి ఉండొచ్చని వ్యాఖ్యానించారు.