July 9, 2026

CM Chandrababu: రైతులకు పట్టాదారు పాసుపుస్తకాలు పంపిణీ.. భువివాదాలు లేకుండా చేస్తాం..

CM Chandrababu: రైతులకు పట్టాదారు పాసుపుస్తకాలు పంపిణీ.. భువివాదాలు లేకుండా చేస్తాం..
Reading Time: < 1 minute
Cm Chandrababu Distributes Pattadar Passbooks At Banganapalle My Land My Right Meeting

CM Chandrababu: నంద్యాల జిల్లా బనగానపల్లెలో నిర్వహించిన ‘మీ భూమి–మీ హక్కు’ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రైతులకు పట్టాదారు పాసుపుస్తకాలను పంపిణీ చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల ప్రకారం విధ్వంసమైన రాష్ట్రానికి పూర్వ వైభవం తీసుకువచ్చి సుపరిపాలన అందిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. గత పాలనలో జరిగిన అరాచకాల వల్ల లక్షలాది కుటుంబాలు నష్టపోయాయని అన్నారు. గత ప్రభుత్వం అమలు చేసిన ల్యాండ్ టైటిలింగ్ చట్టం ప్రజల్లో భయాందోళనలు కలిగించిందని సీఎం వ్యాఖ్యానించారు. మాట వినని వారి భూములను 22ఏ జాబితాలో చేర్చారని ఆరోపిస్తూ, ఎన్నికల హామీ మేరకు ఆ చట్టాన్ని రద్దు చేశామని తెలిపారు. ఎన్టీఆర్ భూమి పన్నును రద్దు చేసినట్లే, భూమి హక్కులను రైతులకు మరింత భద్రంగా కల్పిస్తున్నామని చెప్పారు.

భూమి పట్టాలు, సర్వే రాళ్లపై గత పాలకుల ఫొటోలు ముద్రించారని విమర్శించిన చంద్రబాబు, ప్రస్తుతం రాజముద్రతో కూడిన పట్టాదారు పాసుపుస్తకాలను అందిస్తున్నామని వివరించారు. దళారీ వ్యవస్థను నిర్మూలించేందుకు గ్రామ సభల ద్వారానే పాసుపుస్తకాల పంపిణీ చేపట్టామని తెలిపారు. గత ఏడు నెలల్లో 29 లక్షల పాసుపుస్తకాలను అందించామని, పంపిణీ ప్రక్రియ పూర్తి కావడానికి మరో ఎనిమిది నెలలు పట్టవచ్చని చెప్పారు.

భూ రికార్డుల పారదర్శకత కోసం బ్లాక్‌చెయిన్ సాంకేతికతను ప్రవేశపెట్టినట్లు సీఎం వెల్లడించారు. రైతుల సమక్షంలో రీ–సర్వే నిర్వహిస్తూ, భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం తీసుకువస్తామని హామీ ఇచ్చారు. 1971 రికార్డు ఆఫ్ రైట్స్‌ను పూర్తిచేయడంతో పాటు తిరుపతి జిల్లా శెట్టిపల్లి, గుంటూరు జిల్లా వట్టి చేరుకూరులో దశాబ్దాలుగా కొనసాగుతున్న సమస్యలను పరిష్కరించినట్లు తెలిపారు. అలాగే డోన్ నియోజకవర్గంలోని ఒక గ్రామంలో సుమారు రెండు వేల ఎకరాలను 22ఏ జాబితా నుంచి తొలగించినట్లు పేర్కొన్నారు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు..