Police Transfers: పోలీస్ శాఖలో భారీగా బదిలీలు.. రెండేళ్లు పూర్తిచేసిన వారికి అవకాశం..

ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖలో త్వరలోనే భారీ ఎత్తున బదిలీల ప్రక్రియ ఊపందుకోనుంది. ఒకే స్థానంలో రెండేళ్లకు పైబడి సర్వీసు పూర్తి చేసుకున్న పోలీస్ అధికారులను బదిలీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు రాబోయే వారం నుండి పది రోజుల్లో అధికారికంగా బదిలీల ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉండటంతో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా పోలీస్ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. క్షేత్రస్థాయిలో శాంతిభద్రతల పరిరక్షణతో పాటు రాబోయే కీలక పరిణామాలను దృష్టిలో ఉంచుకుని ఈ బదిలీల ప్రక్రియ సాగుతోంది.
రాజకీయ ఒత్తిళ్లు – ప్రజాప్రతినిధుల సిఫార్సులు..
బదిలీల గడువు దగ్గర పడుతుండటంతో సర్కిల్ ఇన్స్పెక్టర్లు (CI), సబ్ఇన్స్పెక్టర్ల (SI) పోస్టింగ్ల కోసం తెరవెనుక భారీగా లాబీయింగ్ నడుస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. తమ నియోజకవర్గాల్లో తమ మాట వినే, తమతో సమన్వయంగా పనిచేసే అధికారులనే నియమించుకోవాలని కొందరు ప్రజాప్రతినిధులు గట్టిగా పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది. బదిలీల విషయంలో ఎలాంటి రాజకీయ సిఫార్సులను, ఒత్తిళ్లను పరిగణనలోకి తీసుకోవద్దని ముఖ్యమంత్రి స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినప్పటికీ… క్షేత్రస్థాయిలో మాత్రం ప్రజాప్రతినిధుల చుట్టూ అధికారులు ప్రదక్షిణలు చేస్తున్నారనే చర్చ పోలీస్ సర్కిల్స్లో జోరుగా సాగుతోంది.
పుష్కరాల ప్రాధాన్యత..
ఈసారి తూర్పుగోదావరి జిల్లాలో పోస్టింగ్ల కోసం పోటీ పడటానికి రెండు ప్రధాన కారణాలు కనిపిస్తున్నాయి. మొదటిది.. వచ్చే ఏడాది (2027) అత్యంత ప్రతిష్టాత్మకంగా జరగబోయే గోదావరి పుష్కరాలు. ఈ మహా ఈవెంట్లో బందోబస్తు బాధ్యతలు నిర్వహిస్తే వృత్తిపరంగా మంచి గుర్తింపు వస్తుందనే ఆశతో చాలామంది అధికారులు ఇక్కడికి వచ్చేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఇక రెండోది.. రాజమహేంద్రవరం పోలీస్ కమిషనరేట్ ఏర్పాటు ప్రతిపాదన. త్వరలోనే ఈ కమిషనరేట్ కార్యరూపం దాల్చనుండటంతో, ఇప్పుడు ఇక్కడ పోస్టింగ్ దక్కించుకుంటే భవిష్యత్తులో వేగంగా బదిలీ అయ్యే అవకాశం ఉండదని, ఒకే చోట ఎక్కువ కాలం పనిచేయవచ్చని అధికారులు భావిస్తున్నారు.
ప్రస్తుతం ఈ పరిణామాలన్నింటి నడుమ పోలీస్ ఉన్నతాధికారులు బదిలీల జాబితాను సిద్ధం చేసే పనిలో నిమగ్నమయ్యారు. ప్రభుత్వ తుది మార్గదర్శకాల ప్రకారం పారదర్శకంగా బదిలీలు జరుగుతాయా లేక సిఫార్సులకే ప్రాధాన్యత దక్కుతుందా అనేది మరికొద్ది రోజుల్లో రానున్న అధికారిక ఉత్తర్వులతో తేలనుంది.