July 10, 2026

Digital Train Ticket: వాట్సాప్ టిక్కెట్లకు చెల్లుచీటి.. రైల్వే శాఖ తెచ్చిన సరికొత్త రూల్స్..

Digital Train Ticket: వాట్సాప్ టిక్కెట్లకు చెల్లుచీటి.. రైల్వే శాఖ తెచ్చిన సరికొత్త రూల్స్..
Reading Time: 2 minutes
Indian Railways Rail One App New Ticket Rules Whatsapp Screenshots Invalid

రైల్వే ప్రయాణికులు ఇకపై ‘రైల్ వన్’, ఇతర డిజిటల్ యాప్‌ల ద్వారా బుక్ చేసుకున్న ఒరిజినల్ డిజిటల్ టిక్కెట్‌ను మాత్రమే ప్రయాణ సమయంలో చూపించాల్సి ఉంటుందని రైల్వే శాఖ స్పష్టం చేసింది. వాట్సాప్ స్క్రీన్‌షాట్లు, ఫోటోలు, పీడీఎఫ్ ప్రతులు లేదా ఇతర మెసేజింగ్ యాప్‌ల ద్వారా పంపిన టిక్కెట్లను ఎట్టిపరిస్థితుల్లోనూ ప్రయాణ ఆధారాలుగా అంగీకరించబోమని తెలిపింది. అంతేకాకుండా.. టిక్కెట్ బుక్ చేయడానికి ఉపయోగించిన అదే మొబైల్ ఫోన్‌లోనే ఆ డిజిటల్ టిక్కెట్ ఉండాలనే నిబంధనను తప్పనిసరి చేశారు. ప్రయాణికులు రైలు బయలుదేరడానికి ముందే ఈ అన్‌రిజర్వ్‌డ్ డిజిటల్ టిక్కెట్లను కొనుగోలు చేయాల్సి ఉంటుంది, రైలు కదిలిన తర్వాత చేసే ఏ బుకింగ్ అయినా చెల్లదని అధికారులు పేర్కొన్నారు.

సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే తన అధికారిక ఎక్స్ (ట్విట్టర్) ఖాతా ద్వారా ఈ వివరాలను వెల్లడిస్తూ.. ప్రయాణ సమయంలో ఆయా మొబైల్ ఫోన్‌తో పాటు ఒరిజినల్ ఫోటో గుర్తింపు కార్డును కూడా తప్పనిసరిగా దగ్గర ఉంచుకోవాలని స్పష్టం చేసింది. ఇటీవల ఒక ప్రయాణికుడు ఒరిజినల్ యాప్‌లో కాకుండా వాట్సాప్ స్క్రీన్‌షాట్ చూపించినందుకు జరిమానా విధించిన నేపథ్యంలో రైల్వే ఈ వివరణ ఇచ్చింది.

అయితే.. ఈ కొత్త నిబంధనలపై సోషల్ మీడియా వేదికగా ప్రజల నుండి తీవ్ర వ్యతిరేకత, ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా వృద్ధులు, సాంకేతికతపై అవగాహన లేని వారు తమ కుటుంబ సభ్యులపై ఆధారపడి టిక్కెట్లు బుక్ చేయించుకుంటూ ఉంటారు. అటువంటి పరిస్థితుల్లో ఈ నిబంధన తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తుందని నెటిజన్లు వాపోతున్నారు. టిక్కెట్ కొనుగోలు చేసిన వ్యక్తి కాకుండా వేరే వారు ప్రయాణిస్తున్నప్పుడు, అసలు బుక్ చేసిన ఫోన్‌ను ప్రయాణికుడికి ఎలా ఇవ్వగలరని పలువురు ప్రశ్నిస్తున్నారు.

కుటుంబ సభ్యుల కోసం ఆన్‌లైన్‌లో టిక్కెట్లు బుక్ చేసి, సరైన గుర్తింపు కార్డులు ఉన్నప్పటికీ ప్రయాణానికి అనుమతించకపోవడం సరికాదని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అందరికీ సులువుగా ఉండేలా నిబంధనలు చేయాలని, వృద్ధులు మరియు యాప్‌లు వాడటం తెలియని సాధారణ ప్రజలను దృష్టిలో ఉంచుకోకుండా ఈ విధంగా కఠిన నిబంధనలు పెట్టడం వల్ల ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారని సోషల్ మీడియాలో నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.