July 9, 2026

Dy. CM Bhatti Vikramaraka: ఎన్ని సమస్యలు ఉన్నా రైతు భరోసా ఇచ్చాం..

Dy. CM Bhatti Vikramaraka: ఎన్ని సమస్యలు ఉన్నా రైతు భరోసా ఇచ్చాం..
Reading Time: 2 minutes
Dy Cm Bhatti Vikramarka Inaugurates Mega Rythu Mela In Khammam Says Congress Delivered 9000 Crore Rythu Bharosa

Dy. CM Bhatti Vikramaraka: ఖమ్మం జిల్లా చింతకాని మండలం జగన్నాధపురంలో రెండు రోజుల పాటు నిర్వహించనున్న మెగా రైతు మేళాను ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్ కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ల చైర్మన్లు రాయల నాగేశ్వరరావు, నాయుడు సత్యనారాయణ, వ్యవసాయ శాఖ డైరెక్టర్ గోపి, జిల్లా కలెక్టర్ దివాకరతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. రైతులకు ఆధునిక సాగు పద్ధతులు, ప్రభుత్వ పథకాలు, వ్యవసాయ సాంకేతికతపై అవగాహన కల్పించడమే ఈ మెగా రైతు మేళా ప్రధాన లక్ష్యంగా నిర్వాహకులు తెలిపారు.

మెగా రైతు మేళా ప్రాంగణంలోనే శుక్రవారం మధ్యాహ్నం రైతు ఆశీర్వాద సభ నిర్వహించనున్నారు. ఈ సభకు సీఎం రేవంత్ రెడ్డి హాజరుకానున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు సంక్షేమ కార్యక్రమాలు, వ్యవసాయ అభివృద్ధి చర్యలపై సీఎం రైతులను ఉద్దేశించి ప్రసంగణించనున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ.. ఎల్‌నినో ప్రభావంతో ఈ ఏడాది వర్షపాతం తక్కువగా నమోదవుతోందని, రైతులు పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని పంటల ఎంపిక చేసుకోవాలని సూచించారు.

తక్కువ కాలంలో దిగుబడి వచ్చే పంటలు, ఆరుతడి పంటలు, పప్పుధాన్యాల సాగుపై రైతులు దృష్టి సారించాలని కోరారు. నాగార్జునసాగర్‌లో నీటి లభ్యత తక్కువగా ఉన్న నేపథ్యంలో సీతారామ ప్రాజెక్టు, రాజీవ్ లింక్ కెనాల్ ద్వారా వైరా ప్రాజెక్టుకు నీటిని విడుదల చేస్తున్నామని తెలిపారు. ఆ నీరు ఇవాళ లేదా రేపటిలోగా వైరా రిజర్వాయర్‌కు చేరుతుందని వెల్లడించారు.

కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం తొమ్మిది రోజుల్లోనే రూ.9 వేల కోట్ల రైతు భరోసా నిధులను రైతుల ఖాతాల్లో జమ చేసిందని మంత్రి తుమ్మల పేర్కొన్నారు. మధిర నియోజకవర్గంలోని మొక్కజొన్న రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కోరడంతో రాష్ట్రవ్యాప్తంగా మొక్కజొన్న కొనుగోలు చేపట్టినట్లు తెలిపారు. ప్రకృతి, కేంద్ర ప్రభుత్వ సహకారం పూర్తిస్థాయిలో లేకపోయినా రైతుల కోసం ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందన్నారు. కేంద్రం నుంచి అవసరమైన ఎరువులు సాధించామని, బ్లాక్ మార్కెట్‌ను అరికట్టేందుకు టెక్నాలజీ వినియోగిస్తూ యాప్ ద్వారా యూరియా పంపిణీ చేస్తున్నామని చెప్పారు. అలాగే వర్షాల సమాచారాన్ని కూడా సాంకేతికత ద్వారా రైతులకు ఎప్పటికప్పుడు అందిస్తున్నామని వెల్లడించారు.

సభలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల కోసం పనిచేయడం లేదని విమర్శించే వారికి లెక్కలతో సహా సమాధానం చెబుతామని అన్నారు. రైతు భరోసా పథకం కింద కేవలం తొమ్మిది రోజుల్లోనే రూ.9 వేల కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేసిన ప్రభుత్వం కాంగ్రెస్ మాత్రమేనని పేర్కొన్నారు. వ్యవసాయ యాంత్రీకరణ కోసం ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు వెచ్చిస్తోందని, రైతుల ఆదాయం పెరిగేలా చర్యలు తీసుకుంటోందన్నారు.

ఈ సందర్భంగా బీఆర్ఎస్ ప్రభుత్వంపై భట్టి విక్రమార్క విమర్శలు గుప్పించారు. దశాబ్దాల క్రితం నిర్మించిన నాగార్జునసాగర్, ఎస్ఆర్ఎస్పీ, కడెం వంటి ప్రాజెక్టులు ఇప్పటికీ బలంగా ఉన్నాయని, బీఆర్ఎస్ నిర్మించిన ప్రాజెక్టుల పరిస్థితి రాష్ట్ర ప్రజలకు తెలిసిందేనని వ్యాఖ్యానించారు. ఖమ్మం జిల్లాకు గత ప్రభుత్వాలు తగిన నీటి వనరులు అందించలేదని, ఆ విషయాన్ని చరిత్రతో సహా నిరూపిస్తామని అన్నారు. బీఆర్ఎస్ ప్రజలను మాటలతో మోసం చేసే పార్టీ అని, 2023 అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల ఫలితాలే అందుకు నిదర్శనమని పేర్కొన్నారు. ప్రస్తుతం ఆ పార్టీ నేతలు జిల్లాల పర్యటనలు చేస్తూ విమర్శలు చేస్తున్నప్పటికీ ప్రజలు నమ్మే పరిస్థితి లేదని భట్టి విక్రమార్క వ్యాఖ్యానించారు.