July 8, 2026

Tamil Nadu: కరూర్ బాధిత కుటుంబాలకు ప్రభుత్వోద్యోగాలు.. ప్రభుత్వ నిర్ణయంపై హైకోర్టులో సవాల్

Tamil Nadu: కరూర్ బాధిత కుటుంబాలకు ప్రభుత్వోద్యోగాలు.. ప్రభుత్వ నిర్ణయంపై హైకోర్టులో సవాల్
Reading Time: 2 minutes
Tamil Nadu Karur Stampede Victims Government Jobs Madras High Court Petition

తమిళనాడు ప్రభుత్వం కరూర్ తొక్కిసలాటలో మృతి చెందిన 41 మంది కుటుంబ సభ్యులకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వాలన్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ మద్రాస్ హైకోర్టు మదురై బెంచ్‌లో పిటిషన్ దాఖలైంది. ఈ నియామకాలను సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉన్న కేసు తుది తీర్పు వచ్చే వరకు నిలిపివేయాలని పిటిషనర్ కోర్టును కోరారు.

మదురైకు చెందిన న్యాయవాది తీరన్ తిరుమురుగన్ ఈ పిటిషన్ దాఖలు చేశారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, అదనపు ప్రధాన కార్యదర్శి, సిబ్బంది, పరిపాలనా సంస్కరణల శాఖ కార్యదర్శి, హోంశాఖ కార్యదర్శి, రెవెన్యూ, విపత్తు నిర్వహణ శాఖ కార్యదర్శి, కరూర్ జిల్లా కలెక్టర్‌లను ప్రతివాదులుగా చేర్చారు. పిటిషన్‌లో పేర్కొన్న వివరాల ప్రకారం.. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రకటన నేపథ్యంలో జూలై 10న ముఖ్యమంత్రి విజయ్ కరూర్ పర్యటన సందర్భంగా బాధిత కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగాల నియామక పత్రాలు అందజేసే అవకాశం ఉందని పేర్కొన్నారు. అందువల్ల ఆ నియామక ఉత్తర్వులను జారీ చేయకుండా.. అమలు చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని కోర్టును కోరారు.

పిటిషనర్ వాదన ప్రకారం.. ఇలాంటి విషాద ఘటనల్లో మృతి చెందిన వారి కుటుంబాలకు శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించే విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఏకరీతి విధానం లేదన్నారు. ఒకే ఘటనకు మాత్రమే ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడం వల్ల భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 (సమానత్వ హక్కు), ఆర్టికల్ 16 (ప్రభుత్వ ఉద్యోగాల్లో సమాన అవకాశాలు) ఉల్లంఘనకు దారితీసే అవకాశం ఉందని పేర్కొన్నారు. ప్రభుత్వ ఉద్యోగం అనేది విలువైన రాజ్యాంగబద్ధమైన అవకాశం అని.. కేవలం కార్యనిర్వాహక నిర్ణయంతో దానిని అనుగ్రహంలా ఇవ్వకూడదని పిటిషన్‌లో పేర్కొన్నారు. ప్రజా సేవలో నియామకాలు సమానత్వం, పారదర్శకత, న్యాయబద్ధత, వివక్ష రహిత విధానాల ఆధారంగా జరగాలని వాదించారు.

ఏకరీతి విధానం లేదని అభ్యంతరం

ప్రభుత్వ ఉద్యోగాలకు అర్హత కలిగిన ప్రతి ఒక్కరికీ పోటీ చేసే రాజ్యాంగ హక్కు ఉందని.. కానీ ఇలాంటి ప్రమాదాల్లో బాధిత కుటుంబాలకు ఉద్యోగాలు ఇవ్వడానికి ప్రభుత్వం ఎలాంటి స్పష్టమైన విధానం లేదా చట్టపరమైన మార్గదర్శకాలను రూపొందించలేదని పిటిషనర్ తెలిపారు. అలాంటి మార్గదర్శకాలు లేకుండానే ఉద్యోగాలు ఇవ్వడం ఏకపక్షం, అప్రజాస్వామికం, రాజ్యాంగ విరుద్ధం అని పిటిషన్‌లో పేర్కొన్నారు.

సుప్రీంకోర్టులో కేసు పెండింగ్‌లోనే

కరూర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించిన విచారణ ప్రస్తుతం సుప్రీంకోర్టులో కొనసాగుతోందని పిటిషనర్ గుర్తు చేశారు. కేసు తుది తీర్పు రాకముందే ప్రభుత్వ ఉద్యోగాల వంటి తిరిగి మార్చలేని పరిపాలనా నిర్ణయాలు తీసుకుంటే భవిష్యత్తులో చట్టపరమైన, పరిపాలనా సమస్యలు తలెత్తే అవకాశం ఉందని వాదించారు. అందువల్ల సుప్రీంకోర్టు విచారణ పూర్తయ్యే వరకు బాధిత కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగాల నియామక ఉత్తర్వులు జారీ చేయకుండా.. అమలు చేయకుండా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని మద్రాస్ హైకోర్టును కోరారు.