July 10, 2026

AP Cabinet: నేడు ఏపీ కేబినెట్‌ కీలక భేటీ.. అమరావతి అభివృద్ధిపై ఫోకస్‌.. వారికి గుడ్‌న్యూస్‌..!

AP Cabinet: నేడు ఏపీ కేబినెట్‌ కీలక భేటీ.. అమరావతి అభివృద్ధిపై ఫోకస్‌.. వారికి గుడ్‌న్యూస్‌..!
Reading Time: < 1 minute
Ap Cabinet Set To Approve Amaravati Relief For Land Pooling Farmers And Major Investment Projects

AP Cabinet: ఈ రోజు ఉదయం 10.30 గంటలకు రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో రాజధాని అభివృద్ధి, పెట్టుబడుల ప్రోత్సాహం, రైతుల సంక్షేమానికి సంబంధించిన పలు కీలక ప్రతిపాదనలకు ఆమోదం లభించే అవకాశం ఉంది. ముఖ్యంగా ల్యాండ్ పూలింగ్ రైతులకు భారీ ఊరట కల్పించే నిర్ణయాలు మంత్రివర్గం ముందుకు రానున్నాయి. రాజధాని కోసం కొత్తగా భూములు ఇచ్చే రైతులకు ఎకరానికి ఏడాదికి రూ.40 వేల యాన్యుటీ మంజూరు చేయడంతో పాటు, గ్రామ కంఠాల్లో భూములు కోల్పోయిన వారికి నెలకు రూ.10 వేల అద్దె భత్యం అందించే ప్రతిపాదనపై ఆమోదం లభించనుంది. కొత్త పూలింగ్ గ్రామాల రైతులకు రూ.1.50 లక్షల వరకు రుణమాఫీ కల్పించేందుకు కూడా కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నట్లు సమాచారం.

అమరావతి అభివృద్ధికి సంబంధించిన పలు సీఆర్డీఏ ప్రతిపాదనలు కూడా సమావేశంలో పరిశీలనకు రానున్నాయి. ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీ పరిధిలోని 307 ఎకరాల ఇనాం, దేవాదాయ శాఖ భూముల బదిలీ కోసం దేవాదాయ శాఖకు రూ.159 కోట్ల పరిహారం చెల్లించేందుకు సీఆర్డీఏకు అనుమతి ఇచ్చే అవకాశం ఉంది. అలాగే, ఫిషరీస్ శాఖ ఆధ్వర్యంలో ఆధునిక అక్వేరియం, కార్యాలయ నిర్మాణం కోసం రెండు ఎకరాల భూమి కేటాయింపుపై కూడా నిర్ణయం తీసుకోనున్నారు.

ఇదే సమావేశంలో ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థకు 7.42 ఎకరాలు, ఈశా ఫౌండేషన్‌కు భూమితో పాటు పార్కు వినియోగ హక్కులు, నిర్వహణ బాధ్యతలు, అలాగే సీఐఐకు నాలుగు ఎకరాల భూమి కేటాయింపుపై ఆమోదం లభించే అవకాశం ఉంది. మరోవైపు.. రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి 19వ సమావేశంలో ఆమోదించిన 11 ప్రాజెక్టులకు కూడా మంత్రివర్గం ఆమోదం తెలపనుంది. వీటి ద్వారా సుమారు రూ.9,076 కోట్ల పెట్టుబడులు ఆకర్షితమై, 10,531 మందికి ఉపాధి అవకాశాలు లభించే అవకాశముంది. సమావేశం అనంతరం రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాలు, శాంతిభద్రతల పరిస్థితిపై ముఖ్యమంత్రి మంత్రులతో చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.