July 9, 2026

Agadha:14 మిలియన్ వ్యూస్‌తో సంచలనం.. ఎంఎస్ రాజు ‘అగధ’ రిలీజ్ డేట్ ఫిక్స్!

Agadha:14 మిలియన్ వ్యూస్‌తో సంచలనం.. ఎంఎస్ రాజు ‘అగధ’ రిలీజ్ డేట్ ఫిక్స్!
Reading Time: 2 minutes
Ms Rajus Spiritual Thriller Agadha Hits Screens Aug 14

Agadha: తెలుగు చిత్రసీమలో ఎన్నో వైవిధ్యమైన కథలను ప్రేక్షకులకు అందించిన దర్శకుడు ఎంఎస్ రాజు. ఆయన మరోసారి భిన్నమైన కథను వెండితెరపై ఆవిష్కరించేందుకు సిద్ధమయ్యారు. ఆధ్యాత్మికత, పురాణాలు, సస్పెన్స్ ఎలిమెంట్స్ తో తెరకెక్కుతున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రం ‘అగధ’ ఇప్పటికే టీజర్‌తో ప్రేక్షకుల నుంచి విశేష స్పందనను అందుకుంది. టీజర్ విడుదలైనప్పటి నుంచే ఈ సినిమాపై అంచనాలు కూడా బాగా ఏర్పడ్డాయి. అసలు ఈ సినిమాలో ఉన్న రహస్యం ఏమిటి? ఎంఎస్ రాజు ఈసారి ఎలాంటి కొత్త ప్రపంచాన్ని చూపించబోతున్నారు? అనే ఆసక్తి ప్రేక్షకుల్లో రోజురోజుకూ పెరుగుతోంది. అయితే ఇప్పుడు చిత్రబృందం అధికారిక విడుదల తేదీని ప్రకటించడంతో ప్రేక్షకులు కూడా సినిమా చూసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

శ్రీ ఆది వరాహ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై కాశీ విశాలాక్షి బాలుసు నిర్మించిన ఈ చిత్రాన్ని అజయ్ కేఆర్ సమర్పిస్తున్నారు. ‘అగధ’ చిత్రం 2026 ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుందని మేకర్స్ ఈవాల ప్రకటించారు. విడుదల తేదీ ప్రకటనతో పాటు మరోసారి టీజర్‌పై ప్రేక్షకుల్లో చర్చ మొదలైంది. ఇప్పటికే ఈ టీజర్ 14 మిలియన్లకు పైగా డిజిటల్ వ్యూస్ సాధించి మంచి స్పందన అందుకుంది. అద్భుతమైన విజువల్స్, ఆసక్తిని రేకెత్తించే కథనం కారణంగా ఈ టీజర్ సినీ అభిమానులను బాగా ఆకట్టుకుంది. ‘అగధ’ను భారీ స్థాయిలో రూపొందిస్తున్నామని కూడా చిత్రబృందం చెబుతోంది. పురాణ గాథలు, రహస్య శక్తులు, సస్పెన్స్ అంశాలు కలిసిన ఒక కొత్త ప్రపంచంలోకి ప్రేక్షకులను తీసుకెళ్లే ప్రయత్నమే ఈ సినిమా అని వారు పేర్కొంటున్నారు.

ఈ సినిమా గురించి దర్శకుడు ఎంఎస్ రాజు మాట్లాడుతూ, తన కెరీర్‌లో అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ఇదేనని చెప్పారు. ప్రేక్షకులు ఊహించని మలుపులు, ఊపరి సలపనివ్వని సన్నివేశాలు, విజువల్‌గా గొప్ప అనుభూతిని ఇచ్చే కథనం ఈ చిత్రంలో ఉంటాయని ఆయన తెలిపారు. తనతో కలిసి పనిచేసిన ప్రతి నటుడు, సాంకేతిక నిపుణుడు ఈ సినిమాకు పూర్తి అంకితభావంతో పని చేశారని ఆయన ప్రశంసించారు. ఈ చిత్రంలో మహాదేవి పాత్రను పోషించిన కామాక్షి భాస్కర్ల కూడా ఈ ప్రాజెక్ట్‌పై ఎంతో నమ్మకం వ్యక్తం చేశారు. ఈ పాత్ర తన కెరీర్‌లో ప్రత్యేక గుర్తింపు తీసుకువస్తుందని ఆమె అన్నారు. మరో నటుడు శ్రవణ్ రెడ్డి, ‘డర్టీ హరి’ తర్వాత మళ్లీ ఎంఎస్ రాజుతో కలిసి పనిచేయడం ఆనందంగా ఉందని, ‘అగధ’ తన అనూహ్యమైన స్క్రీన్‌ప్లే, ఆసక్తికరమైన కథనంతో ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తుందని చెప్పారు.

ఈ చిత్రంలో ఉల్కా గుప్తా, జోవికా విజయ్ కుమార్, సిజ్జు కీలక పాత్రలు పోషిస్తున్నారు. సంగీతాన్ని రాకేష్ వెంకటపురం అందించగా, సినిమాటోగ్రఫీని నాని చామిడిశెట్టి నిర్వహించారు. ఎడిటింగ్ బాధ్యతలను జునైద్ సిద్ధిఖీ చేపట్టగా, రాజీవ్ నాయర్ ప్రొడక్షన్ డిజైనర్‌గా పనిచేశారు. తెలుగు చిత్రసీమలో అరుదుగా కనిపించే ఆధ్యాత్మిక థ్రిల్లర్ జానర్‌లో తెరకెక్కుతున్న ‘అగధ’ ఇప్పటికే ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతోంది. టీజర్‌కు వచ్చిన స్పందనతో   విడుదలకు ముందే మంచి అంచనాలను సొంతం చేసుకుంది. ఆగస్టు 14న థియేటర్లలోకి రానున్న ఈ సినిమా ప్రేక్షకులను ఎలా ఎంటర్టైన్ చేస్తుందో చూడాలి మరి.