Tragedy: వీడు మనిషి కాదు మానవ మృగం.. పోక్సో కేసు పెట్టారన్న కక్షతో.. భార్య, ఇద్దరు పిల్లలతో పాటు మరో ముగ్గురి హత్య..

Ranga Reddy Shabad Horror: రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలంలో జరిగిన దారుణ ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. ఒకే రోజు ఆరుగురు దారుణ హత్యకు గురికావడంతో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి. పోలీసులు తెలిపిన ప్రాథమిక వివరాల ప్రకారం, నిందితుడు రాజు కుమార్ (28) తన భార్య, ఇద్దరు చిన్నారులతో పాటు తనపై గతంలో పోక్సో కేసు నమోదు చేసిన 17 ఏళ్ల బాలిక, ఆమె తల్లి, నానమ్మలను అత్యంత కిరాతకంగా హత్య చేశాడు.
రెండు ప్రాంతాల్లో హత్యలు
పోలీసుల సమాచారం ప్రకారం, నిందితుడు రాజు కుమార్ (28) మొదట తన ఇంట్లో నిద్రిస్తున్న భార్య పార్వతి సరిత (30), కుమారులు పరీక్షిత్ (3), దైవిక్షిత్ (2)లను కత్తితో దాడి చేసి హత్య చేశాడు. అనంతరం పోక్సో కేసులో బాధితురాలైన 17 ఏళ్ల బాలిక ఇంటికి వెళ్లి, అక్కడ ఆమె తల్లి చిట్యాల లక్ష్మీ (45), నానమ్మ చిట్యాల రుక్కమ్మ (65)లను హత్య చేసినట్లు అధికారులు తెలిపారు. తదుపరి బాలికను గ్రామ శివారులోని చెరువు వద్దకు తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడి అనంతరం హత్య చేసినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైనట్లు సమాచారం.
పోక్సో కేసు నేపథ్యం
పోలీసుల కథనం ప్రకారం, నిందితుడిపై గతంలో మైనర్ బాలికపై లైంగిక దాడి చేసిన కేసు నమోదైంది. ఆ కేసులో జైలుకు వెళ్లి ఇటీవలే బయటకు వచ్చిన అనంతరం ఈ ఘోరానికి పాల్పడినట్లు అనుమానిస్తున్నారు. ఈ ఘటనకు పోక్సో కేసు కారణమై ఉండొచ్చనే కోణంలో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
పోలీసుల దర్యాప్తు
సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు భారీ బందోబస్తుతో సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ప్రభుత్వ ఆసుపత్రులకు తరలించారు. డాగ్ స్క్వాడ్, క్లూస్ టీమ్ సహాయంతో ఆధారాలను సేకరిస్తున్నారు. ఈ ఘటనపై హత్య, లైంగిక నేరాలకు సంబంధించిన పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీులు తెలిపారు.
మృతుల వివరాలు
పార్వతి సరిత (30) – నిందితుడి భార్య
పరీక్షిత్ (3)
దైవిక్షిత్ (2)
చిట్యాల రుక్కమ్మ (65)
చిట్యాల లక్ష్మీ (45)
17 ఏళ్ల మైనర్ బాలిక