July 9, 2026

Daughter Kills Mother: మానవత్వం మరిచిన కూతురు.. ఆస్తి, ప్రభుత్వ ఉద్యోగం కోసం కన్నతల్లినే చంపిన కుమార్తె..

Daughter Kills Mother: మానవత్వం మరిచిన కూతురు.. ఆస్తి, ప్రభుత్వ ఉద్యోగం కోసం కన్నతల్లినే  చంపిన కుమార్తె..
Reading Time: 2 minutes
Jaipur Daughter Allegedly Kills Mother Over Property Government Job Supari Murder

Daughter Kills Mother: కుటుంబ ఆస్తి కోసం, ప్రభుత్వ ఉద్యోగం కోసం కన్నతల్లిని కడతేర్చిన ఓ 23 ఏళ్ల కూతురి ఘాతుకం జైపూర్‌లో వెలుగుచూసింది. ఈ దారుణ హత్యను రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు సదరు యువతి ఏకంగా రూ. 7 లక్షల సుపారీ ఇచ్చింది. వేగంగా దూసుకొచ్చిన స్కార్పియో ఎస్‌యూవీతో తల్లిని తొక్కించి చంపేలా కుట్ర పన్నింది. పోలీసుల కథనం ప్రకారం.. జైపూర్‌లోని ప్రతాప్ నగర్ ప్రాంతంలో జూలై 3న ఈ ఘోరం జరిగింది. బాధితురాలు, 45 ఏళ్ల నీరజ్ శర్మ ఓ కోర్టులో లోయర్ డివిజన్ క్లర్క్ (LDC)గా పనిచేస్తున్నారు. సంఘటన రోజున నీరజ్ శర్మ తన కుమారుడిని కోచింగ్ సెంటర్‌లో దించి ఇంటికి తిరిగి వస్తుండగా.. సుమారు 130 కిలోమీటర్ల వేగంతో దూసుకొచ్చిన స్కార్పియో వాహనం ఆమెను బలంగా ఢీకొట్టింది. ఆ ప్రమాద తీవ్రతకు ఆమె శరీరం దాదాపు 100 అడుగుల దూరం గాల్లోకి ఎగిరి పడటంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదం జరిగిన వెంటనే డ్రైవర్ వాహనంతో సహా పరారయ్యాడు.

అయితే, పోలీసులు సంఘటనా స్థలంలోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించగా.. అది ప్రమాదం కాదని, ముందస్తు ప్రణాళికతో చేసిన హత్య అని తేలింది. పోలీసులు విచారించగా కుటుంబ సభ్యులే హంతకులని బయటపడింది. జైపూర్ డీసీపీ ఈస్ట్ రంజితా శర్మ తెలిపిన వివరాల ప్రకారం.. నీరజ్ శర్మ భర్త ఏడాది క్రితం మరణించారు. ఆయన మరణానంతరం కారుణ్య నియామకం కింద నీరజ్ శర్మకు కోర్టులో ఎల్‌డీసీగా ఉద్యోగం వచ్చింది. నిజానికి తండ్రి మరణం తర్వాత ఆ ప్రభుత్వ ఉద్యోగం తనకు రావాలని కూతురు ఆయుషి ఆశపడింది. తల్లి ఆ ఉద్యోగంలో చేరడం కుమార్తెకు నచ్చలేదు. దీనికి తోడు గత రెండు, మూడేళ్లుగా తల్లికూతుళ్ల మధ్య ఆస్తి గొడవలు కూడా నడుస్తున్నాయి. దీంతో తల్లిని ఎలాగైనా వదిలించుకుంటే ఆస్తితో పాటు ఆ ప్రభుత్వ ఉద్యోగం కూడా తనకే వస్తుందని ఆయుషి పక్కా ప్లాన్ వేసింది. ఇందుకోసం తన బాబాయ్ మోహన్ స్వరూప్, బావ బలరామ్ అలియాస్ రవితో చేతులు కలిపింది. తల్లిని చంపేందుకు భరత్‌పూర్‌కు చెందిన హేమంత్ శర్మ అనే వ్యక్తికి రూ. 7 లక్షల సుపారీ ఇచ్చారు.

నీరజ్ శర్మ కదలికలపై నిఘా పెట్టేందుకు నిందితులు మొదట ఓ రెంటెడ్ థార్ (Thar) వాహనాన్ని ఉపయోగించారు. కానీ ఆ ప్రయత్నం ఫలించలేదు. దాదాపు నెల రోజుల పాటు ఆమె రోజువారీ దినచర్యను గమనించిన తర్వాత, చివరకు స్కార్పియో కారుతో ఢీకొట్టి చంపాలని నిర్ణయించుకున్నారు. హత్య జరిగిన రోజున నిందితులు నీరజ్ శర్మను వెంబడించారు. మోహిత్ శర్మ అనే వ్యక్తి ఆమె లొకేషన్ సమాచారాన్ని చేరవేయగా, రోహిత్ జాతవ్ అనే మరో నిందితుడు మోటార్ సైకిల్‌పై నిలబడి నిఘా ఉంచాడు. ఆకాష్ శర్మ అనే డ్రైవర్ స్కార్పియోను నడపగా, అరవింద్ శర్మ అతని పక్కన కూర్చుని నీరజ్ శర్మను బలంగా ఢీకొట్టారు. అనంతరం కారును అక్కడే వదిలేసి బైక్‌పై పారిపోయారు. నీరజ్ శర్మ సోదరుడు రాకేష్ కుమార్ శర్మ ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఆస్తి విషయంలో కూతురు, అత్తగారి తరఫు బంధువులు తన అక్కను తీవ్రంగా వేధిస్తున్నారని, గతంలో ఆమెకు ప్రాణభయంతో కూడిన బెదిరింపులు కూడా వచ్చాయని ఆయన పోలీసులకు తెలిపారు.