హీరోయిన్ అంటే గ్లామర్ మాత్రమేనా?.. బాలీవుడ్ ట్రెండ్పై హుమా ఫైర్

Huma Qureshi: హిందీ చిత్రసీమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు బాలీవుడ్ నటి హుమా ఖురేషి. ‘గ్యాంగ్స్ ఆఫ్ వాసేపూర్’ చిత్రంతో బాలీవుడ్లో అరంగేట్రం చేసిన ఆమె, తర్వాత ‘మహారాణి’ వెబ్ సిరీస్తో ఓటీటీ ప్రేక్షకుల మన్ననలు కూడా అందుకున్నారు. ప్రతి ప్రాజెక్ట్లో కొత్తదనం కోసం ప్రయత్నించే హుమా, ఇప్పుడు నిర్మాతగా కూడా తన ప్రయాణాన్ని విస్తరించారు. అయితే సినిమాలలో హీరోయిన్స్ ను చూపిస్తున్న విధానంపై రీసెంట్ గా హుమా ఖురేషి ఫైర్ అయ్యారు. ఒక మహిళ బలమైన పాత్రలో కనిపించాలంటే ఆమెను తప్పనిసరిగా గ్లామరస్గా, శృంగారభరితంగా చూపించాల్సిందే అన్న భావన ఇప్పటికీ చిత్రసీమలో కొనసాగుతుండటం బాధాకరమని ఆమె వ్యాఖ్యానించారు. తాజాగా విడుదలైన తన చిత్రం ‘బేబీ డూ డై డూ’ ప్రమోషన్ల సందర్భంగా చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఆమె ప్రధాన పాత్రలో నటించి, నిర్మించిన సస్పెన్స్ యాక్షన్ థ్రిల్లర్ ‘బేబీ డూ డై డూ’ జూలై 3న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రంలో హుమా ఒక మూగ, కిరాయి హంతకురాలి పాత్రను పోషించారు. సాధారణంగా యాక్షన్ సినిమాల్లో మహిళా పాత్రలను అతిగా గ్లామరైజ్ చేస్తూ చూపించే విధానానికి భిన్నంగా, ఈ సినిమాలో పూర్తిగా సాధారణ మహిళలా కనిపించే పాత్రలో ఆమె నటించడం ప్రత్యేకతను సంతరించుకుంది. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో హుమా ఖురేషి బాలీవుడ్లో మహిళా పాత్రలపై తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. మహిళా పాత్రలను కేవలం ఆకర్షణీయంగా చూపించడమే లక్ష్యంగా రూపొందించడం సరైన దిశ కాదని స్పష్టం చేశారు. మహిళలకు మరింత బలమైన, వైవిధ్యమైన పాత్రలు రాయాల్సిన అవసరం ఉందని ఆమె అభిప్రాయపడ్డారు. ‘బేబీ డూ డై డూ’లో తన పాత్ర ముంబై లోకల్ రైల్లో ప్రయాణించే ఒక సాధారణ మహిళలా కనిపించినప్పటికీ, అవసరమైన సమయంలో అత్యంత ప్రమాదకరమైన కిల్లర్గా మారుతుందని చెప్పారు. పాత్ర బలం గ్లామర్లో కాదు, దాని నటనలో ఉంటుందని ఈ సినిమా ద్వారా చూపించాలనుకున్నామని వెల్లడించారు.
అంగ వైకల్యాన్ని కూడా సమాజం చాలాసార్లు బలహీనతగా చూస్తుందని హుమా ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఈ సినిమాలో అదే అంశాన్ని పూర్తిగా భిన్నంగా చూపించామని వివరించారు. మాట్లాడలేని, వినలేని మహిళ కూడా ఎంత ప్రమాదకరమైన హంతకురాలిగా మారగలదో ఈ కథ చూపిస్తుందని, ఇక్కడ ఆమె శారీరక లోపమే ఆమెకు అతిపెద్ద ఆయుధంగా మారుతుందని చెప్పారు. మహిళలపై ఉన్న అనేక మూస అభిప్రాయాలను ఈ సినిమా ప్రశ్నిస్తుందని ఆమె అభిప్రాయపడ్డారు. నచికేత్ సమంత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని హుమా ఖురేషి, ఆమె సోదరుడు సాకిబ్ సలీమ్ కలిసి తమ సలీమ్ సిబ్లింగ్స్ బ్యానర్పై నిర్మించారు. ఈ చిత్రంలో సికిందర్ ఖేర్, చుంకీ పాండే, సీమా పహ్వా, రచిత్ సింగ్ కీలక పాత్రలు పోషించారు.
ఇక హుమా ఖురేషి తదుపరి ప్రాజెక్ట్ కూడా భారీ స్థాయిలోనే ఉండబోతోంది. కేజీఎఫ్ స్టార్ యశ్ హీరోగా, గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో రూపొందుతున్న పాన్ ఇండియా యాక్షన్ చిత్రం టాక్సిక్లో ఆమె కీలక పాత్రలో కనిపించనున్నారు. కియారా అద్వానీ, నయనతార, రుక్మిణి వసంత్, తారా సుతారియా వంటి ప్రముఖ నటీమణులతో కలిసి నటిస్తున్న ఈ చిత్రం ఆగస్టు 26న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. టాక్సిక్ తో హుమా ఖురేషి దక్షిణాది ప్రేక్షకులకు మరింత చేరువ కావడంతో పాటు, ఆమె కెరీర్ మరో కీలక మలుపు తిరిగే అవకాశముందని సినీ వర్గాలు భావిస్తున్నాయి.