July 9, 2026

Nitin Gadkari: E20 పెట్రోల్ వల్ల ఒక్క కారైనా పాడైందా?.. విమర్శకులపై కేంద్ర మంత్రి గడ్కరీ ఫైర్..

Nitin Gadkari: E20 పెట్రోల్ వల్ల ఒక్క కారైనా పాడైందా?.. విమర్శకులపై కేంద్ర మంత్రి గడ్కరీ ఫైర్..
Reading Time: 2 minutes
Nitin Gadkari E20 Ethanol Petrol Vehicle Performance Claims

Nitin Gadkari: పెట్రోల్‌లో ఇథనాల్ కలపడం (Ethanol-blended petrol) వల్ల వాహనాల పనితీరు దెబ్బతింటుందనే అనుమానాలు, విమర్శలపై కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఘాటుగా స్పందించారు. ఈ ఇంధనం (E20 Fuel) వల్ల దేశంలో ఒక్క కారుకైనా నష్టం వాటిల్లినట్లు నిరూపించగలరా? అంటూ ఆయన విమర్శకులకు సవాలు విసిరారు. ఇథనాల్ బ్లెండింగ్‌పై కొందరు కావాలనే అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారని కొట్టిపారేశారు. ఇక, దేశీయంగా ముడి చమురు దిగుమతులను తగ్గించుకోవడానికి, కాలుష్యాన్ని అదుపు చేయడానికి, అలాగే దేశీయ వ్యవసాయ రంగాన్ని ఆదుకోవడానికి భారత ప్రభుత్వం పెట్రోల్‌లో 20 శాతం ఇథనాల్ కలిపే ‘E20 ఇంధన’ లక్ష్యాన్ని ఇప్పటికే విజయవంతంగా అందుకుంది. అయితే, ఈ ఇథనాల్ కలపడం వల్ల మైలేజ్ (ఇంధన సామర్థ్యం) తగ్గుతోందని, పాత వాహనాల ఇంజన్లపై దీని ప్రభావం పడుతుందనే చర్చ ఇటీవల మళ్లీ తెరపైకి వచ్చింది. మంగళవారం జరిగిన ‘వికసిత్ భారత్ కాన్‌క్లేవ్’లో నితిన్ గడ్కరీ ఈ అంశంపై మాట్లాడుతూ.. “E20 పెట్రోల్ వల్ల వాహనాలకు సమస్యలు వస్తున్నాయనే దాంట్లో ఎలాంటి నిజం లేదు. దేశంలో దీనివల్ల ఏ కారైనా పాడైందా? ఉంటే ఒక్క కారు పేరైనా చెప్పండి” అని ప్రశ్నించారు. ఈ ఇంధనంపై జరుగుతున్న ప్రచారాలు కేవలం పెయిడ్ క్యాంపెయిన్స్ మాత్రమేనని ఆరోపించారు.

అసలు ఏంటో ఈ ఇథనాల్ వివాదం?

చెరకు, జొన్నలు, మొక్కజొన్న, బియ్యం వంటి పంటల నుంచి తయారుచేసే బయోఫ్యూయల్‌ను (జీవ ఇంధనం) పెట్రోల్‌లో కలపడమే ఈ ఇథనాల్ బ్లెండింగ్ ప్రోగ్రామ్. దీనివల్ల దేశానికి ముడి చమురు దిగుమతి ఖర్చులు తగ్గడంతో పాటు రైతులకు అదనపు ఆదాయం లభిస్తుందని ప్రభుత్వం చెబుతోంది. అయితే, సాధారణ పెట్రోల్‌తో పోలిస్తే ఇథనాల్ కలిపిన ఇంధనం వల్ల మైలేజ్ కాస్త తగ్గుతుందని, అలాగే పాత వాహనాల ఇంజన్లు ఈ తరహా ఇంధనానికి తగినట్లుగా డిజైన్ చేయనందున అవి పాడయ్యే ప్రమాదం ఉందనేది విమర్శకుల వాదన. బ్రెజిల్ వంటి దేశాల్లో వినియోగదారులకు నచ్చిన ఇథనాల్-పెట్రోల్ శాతాన్ని ఎంచుకునే సదుపాయం పెట్రోల్ బంకుల్లో ఉంటుంది. కానీ, భారతదేశంలో ప్రస్తుతం అలాంటి ఆప్షన్ లేదు. దేశవ్యాప్తంగా ఇప్పుడు E20 పెట్రోలే ప్రామాణికంగా అందుబాటులో ఉంది.

ఇక ఈ అంశంపై కేంద్ర మంత్రి తాజాగా క్లారిటీ ఇచ్చారు. భారత్ ఇంధన దిగుమతుల కోసం ఏటా దాదాపు రూ. 22 లక్షల కోట్లు ఖర్చు చేస్తోందని, అందుకే ప్రత్యామ్నాయ ఇంధనాల వైపు వెళ్లడం దేశానికి వ్యూహాత్మకంగా ఎంతో అవసరమని గడ్కరీ సమర్థించుకున్నారు. ఈ ఇథనాల్ విధానం తన కుటుంబ వ్యాపారాలకు లబ్ధి చేకూర్చేందుకేనంటూ వస్తున్న ఆరోపణలను తిప్పికొట్టారు. తమ కుటుంబానికి చక్కెర కర్మాగారాలు ఉన్న మాట నిజమే అయినప్పటికీ.. తమ వ్యాపారాలు కేవలం ఇథనాల్ ఉత్పత్తిపైనే ఆధారపడలేదని, వ్యక్తిగత ప్రయోజనాల కోసం ప్రభుత్వ విధానాలను మార్చలేదని స్పష్టం చేశారు. మొక్కజొన్న నుంచి ఇథనాల్ తయారు చేయడానికి అనుమతించిన తర్వాత రైతులకు ఎంతగానో మేలు జరిగిందని మంత్రి వివరించారు. గతంలో మొక్కజొన్న మార్కెట్ ధర క్వింటాలుకు రూ. 1,200 ఉండగా, మద్దతు ధర (MSP) రూ. 1,800 ఉండేది. కానీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తర్వాత మార్కెట్లో మొక్కజొన్న ధర క్వింటాలుకు రూ. 2,800 కు చేరిందని తెలిపారు. ఈ మార్పు వల్ల ఉత్తరప్రదేశ్, బిహార్ వంటి రాష్ట్రాల్లోని రైతులకు అదనంగా రూ. 45,000 కోట్ల ఆదాయం సమకూరిందని పేర్కొన్నారు.