ఖమ్మం అంటే వ్యవసాయం.. వ్యవసాయం అంటే ఖమ్మం: డిప్యూటీ సీఎం భట్టి

గత ప్రభుత్వం పూర్తి కాలంలో రైతులకు 72 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే.. ఈ ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ రెండున్నర ఏళ్లలోనే ఏకంగా రూ.34 వేల కోట్లను నేరుగా రైతులకు అందించిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడించారు.అంతేకాదు, వ్యవసాయం, దాని అనుబంధ రంగాల కోసం తమ ప్రభుత్వం మొత్తం రూ.1,67,877 కోట్లను రైతులకు కేటాయించిందని ఆయన స్పష్టం చేశారు. పంటల బీమా, క్రాప్ డ్యామేజ్, ఫార్మ్ మెకనైజేషన్, ఆత్మీయ భరోసా వంటి పథకాల ద్వారా ఈ నిధులను ఖర్చు చేసినట్లు తెలిపారు.
కేవలం 9 రోజుల్లోనే లక్షల ఎకరాల రైతు భరోసా కోసం ప్రభుత్వం రూ.8,759 కోట్లు విడుదల చేసిందని.. దీనికి అదనంగా మరో రూ.1,009 కోట్లు పెంచి, మరిన్ని వేల ఎకరాలకు, కొన్ని లక్షల మంది రైతులకు పెట్టుబడి సాయం అందించబోతున్నామని భట్టి ప్రకటించారు.
భట్టి విక్రమార్క మాటల్లోనే చెప్పాలంటే…ఖమ్మం అంటేనే వ్యవసాయం.. వ్యవసాయం అంటేనే ఖమ్మం మేజర్, మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్టులపైనే ఇక్కడి వ్యవసాయ రంగం ఆధారపడి ఉంది. రైతుల కోరికలు తీర్చడమే లక్ష్యంగా రేపు మేము రైతు ఆశీర్వాద సభను ఏర్పాటు చేస్తున్నాం. జులై 10న రేపు జరగబోయే ఈ ప్రతిష్టాత్మక ‘రైతు ఆశీర్వాద సభ’కు మూడు నుండి మూడున్నర లక్షల మంది జనసమీకరణ చేస్తున్నట్లు భట్టి విక్రమార్క తెలిపారు. సహచర రైతు సోదరులు, ప్రజలు ప్రతి ఒక్కరూ ఈ సభలో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.