TMC: సొంత డబ్బులతో విమానం కొని, దానికే అద్దె చెల్లించారు.. తృణమూల్ స్కాంతో ఈడీ షాక్..

TMC: మమతా బెనర్జీ పార్టీ తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ)లో నిధుల మళ్లింపు వ్యవహారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED)నే షాక్కు గురిచేస్తోంది. సుమారు రూ.440 కోట్ల నిధులు కలిగిన మూడు బ్యాంక్ అకౌంట్లను ఈడీ ఫ్రీజ్ చేసింది. పార్టీ నిధులతో విలాసవంతమైన జెట్లు, వీఐపీ హెలికాప్టర్ కొనుగోలు చేసి, ఆ తర్వాత అదే విమానాలకు టీఎంసీ నిధుల నుంచి అద్దె చెల్లించారు. మనీలాండరింగ్ కోణంలో ఒక రాజకీయ పార్టీ నిధులపై ఈడీ స్వతంత్రంగా దర్యాప్తు చేయడం ఇదే మొదటిసారి.
కోల్కతాకు చెందిన విమానయాన నిర్వహణ, లీజింగ్ సంస్థ అయిన కేర్వెల్ ఏవియేషన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్పై ఈడీ దాడులు చేసిన తర్వాత ఈ మొత్తం గోల్మాల్ వెలుగులోకి వచ్చింది. ఈ కంపెనీ సెప్టెంబర్ 2021లో ఏర్పడింది. ఇదే ఏడాది మమతా బెనర్జీ నేతృత్వంలో టీఎంసీ మూడోసారి అధికారంలోకి వచ్చింది. ఏప్రిల్ 2023 నుండి జూన్ 2026 మధ్యకాలంలో టీఎంసీ బ్యాంకు ఖాతాల నుండి కేర్వెల్ ఏవియేషన్కు సుమారు రూ.160 కోట్లు బదిలీ అయ్యాయి. ఈ మొత్తంలో రూ.82.96 కోట్లను ఆ సంస్థ మరో కొత్త కంపెనీకి బదిలీ చేసినట్లు కూడా దర్యాప్తులో వెల్లడైంది.
రూ. 112 కోట్లతో విమానాలు, హెలికాప్టర్ల కొనుగోలు..
టీఎంసీ డబ్బులు వినియోగించి, కేర్వెల్ ఏవియేషన్ సుమారు రూ. 112 కోట్ల వ్యయంతో ఒక ఎంబ్రాయర్ లెగసీ 600 బిజినెస్ జెట్, అగస్టా 109 ఎస్పీ హెలికాప్టర్ కొనుగోలు చేసినట్లు ఈడీ ఆరోపిస్తోంది. 2023లో హెలికాప్టర్ కొనుగోలు చేసేందుకు కేమన్ ఐలాండ్కు చెందిన ఒక కంపెనీ నుంచి దాదాపుగా రూ. 16 కోట్ల రుణాన్ని తీసుకున్నట్లు ఈడీ దర్యాప్తులో వెల్లడైంది. కేమన్ దీవులు ఆఫ్షోర్ కంపెనీలకు ప్రధాన కేంద్రంగా ఉంది. ఈ విదేశీ నిధుల మూలాలు, ఉద్దేశ్యంపై ఈడీ దర్యాప్తు చేస్తోంది.
సొంత డబ్బులతో కొని, మళ్లీ అద్దె చెల్లింపు:
ఈడీ విచారణలో ఒక విషయం షాకింగ్కు గురిచేస్తోంది. టీఎంసీ నిధులతో కొనుగోలు చేసిన విమానం, హెలికాప్టర్ను కేర్వెల్ ఏవియేషన్ మళ్లీ టీఎంసీకి చార్టర్ సర్వీస్గా అందించింది. అంటే, టీఎంసీ డబ్బులతో కొని, దాన్ని వాడిన ప్రతీసారి టీఎంసీ డబ్బులతో అద్దె చెల్లించారని ఈడీ అనుమానిస్తోంది. అయితే, ఈ విషయంపై దర్యాప్తు మరింత లోతుగా సాగుతోంది. కేర్వెల్ ఏవియేషన్ పశ్చిమ బెంగాల్లోని పలువురు వీవీఐపీ నాయకులకు చార్టర్ విమానాలను అందించింది. తృణమూల్ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మమతా బెనర్జీ మేనల్లుడు అయిన అభిషేక్ బెనర్జీ కూడా ఈ కంపెనీ చార్టర్ సేవలను ఉపయోగించుకున్నారని బెంగాల్ మీడియా చెబుతోంది.