July 10, 2026

సుప్రీంకోర్టులో ఊహించని ఘటన.. జడ్జిలపైకి పేపర్లు విసిరి, దుర్భాషలాడిన పిటిషనర్..!

సుప్రీంకోర్టులో ఊహించని ఘటన.. జడ్జిలపైకి పేపర్లు విసిరి, దుర్భాషలాడిన పిటిషనర్..!
Reading Time: 2 minutes
సుప్రీంకోర్టులో ఊహించని ఘటన.. జడ్జిలపైకి పేపర్లు విసిరి, దుర్భాషలాడిన పిటిషనర్..!

భారత అత్యున్నత న్యాయస్థానం చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా ఒక అనూహ్య, షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన ఒక ఉత్తర్వును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై విచారణ జరుగుతుండగా.. కోర్టుకు స్వయంగా హాజరైన ఒక పిటిషనర్ తీవ్ర ఆగ్రహంతో ధర్మాసనంపైకే కేసు పత్రాలను విసిరేసి, న్యాయమూర్తులను దుర్భాషలాడాడు. శుక్రవారం (జూలై 10) జరిగిన ఈ ఘటన సుప్రీంకోర్టు ప్రాంగణంలో తీవ్ర కలకలం రేపింది.

న్యాయమూర్తులు జస్టిస్‌ కె.వి. విశ్వనాథన్, జస్టిస్‌ అలోక్ అరధేలతో కూడిన ధర్మాసనం ఎదుట ఈ కేసు విచారణకు వచ్చింది. లాయర్ లేకుండా స్వయంగా వాదనలు వినిపించడానికి వచ్చిన సదరు పిటిషనర్, ప్రారంభం నుంచే తీవ్ర దూకుడు ధోరణి ప్రదర్శించాడు. న్యాయమూర్తులను ఉద్దేశించి మాట్లాడుతూ.. “న్యాయాధికారి గారూ, లక్నో ఏసీపీపై వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని మిమ్మల్ని ఆదేశిస్తున్నాను” అంటూ అసాధారణ వ్యాఖ్యలు చేశాడు. కోర్టు గదిలో ఒక పిటిషనర్ ఇలాంటి పదజాలం వాడటంతో జస్టిస్ విశ్వనాథన్ తీవ్ర ఆశ్చర్యానికి గురయ్యారు. “మీరు మమ్మల్నే ఆజ్ఞాపిస్తున్నారా?” అని సదరు వ్యక్తిని ప్రశ్నించారు. దానికి ఆ వ్యక్తి ఏమాత్రం తగ్గకుండా.. “నా వైపు నుంచి ఇంతే.. ప్రతిదీ రికార్డులో ఉంది” అని సమాధానమిచ్చాడు.

పేపర్లు విసిరి, బూతులు తిడుతూ రచ్చ

లీగల్ వెబ్‌సైట్ ‘లైవ్ లా’ కథనం ప్రకారం.. న్యాయమూర్తి ప్రశ్నించిన కొద్దిసేపటికే సదరు పిటిషనర్ ఒక్కసారిగా సహనం కోల్పోయాడు. తన చేతిలో ఉన్న కేసు పత్రాలను చింపి, కోర్టు గదిలో గాలిలోకి, ధర్మాసనం వైపు విసిరేశాడు. అంతటితో ఆగకుండా దేశ ప్రధాన న్యాయమూర్తిని (CJI), ధర్మాసనాన్ని ఉద్దేశించి తీవ్రమైన దుర్భాషలాడుతూ.. బూతులు తిడుతూ రచ్చ చేశాడు. దీంతో కోర్టు హాల్‌లోని న్యాయవాదులు, సిబ్బంది అంతా ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు.

కోర్టు గదిలో ఉద్రిక్తత పెరగడంతో అక్కడే ఉన్న సుప్రీంకోర్టు భద్రతా సిబ్బంది వెంటనే అలర్ట్ అయ్యారు. సదరు పిటిషనర్‌ను బలాత్కారంగా పట్టుకుని, కోర్టు గదిలో నుంచి బయటకు ఈడ్చుకెళ్లారు. ఆ తర్వాత కోర్టులో శాంతిభద్రతలను పునరుద్ధరించారు. ఈ హైడ్రామా అంతా జరుగుతున్నంత సేపు ధర్మాసనం ఎంతో సంయమనం పాటించింది. ఆ వ్యక్తి ప్రవర్తనపై తీవ్ర అసంతృప్తి వ్యక్తమైనప్పటికీ, న్యాయమూర్తులు ప్రశాంతంగానే ఉన్నారు. సదరు వివాదాస్పద పిటిషనర్ వివరాలు, అలాగే కోర్టు ధిక్కరణ కింద అతడిపై తీసుకోబోయే తదుపరి చట్టపరమైన చర్యల గురించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..