Gambhir: ఓటమికి ప్రధాన కారణం ఇదే.. ‘నమ్మకం పెట్టుకుంటే ముంచేశారు’.. గంభీర్ షాకింగ్ కామెంట్స్..

ఇంగ్లాండ్ పర్యటనలో భారత టీ20 జట్టు ప్రదర్శనపై హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. బ్రిటన్ పర్యటనలో జట్టు ఆశించిన స్థాయిలో రాణించకపోవడానికి మ్యాచ్ పరిస్థితులను, పిచ్ స్వరూపాన్ని సరిగ్గా అర్థం చేసుకోకపోవడమే ప్రధాన కారణమని ఆయన అంగీకరించారు. మంగళవారం జరిగిన మూడో టీ20 మ్యాచ్లో ఇంగ్లాండ్ చేతిలో 125 పరుగుల భారీ తేడాతో భారత్ ఓటమి పాలైంది. పరుగుల పరంగా టీ20 అంతర్జాతీయ క్రికెట్లో భారత్కు ఇదే అతిపెద్ద పరాజయం కావడం గమనార్హం. ఈ ఓటమితో ఐదు మ్యాచ్ల సిరీస్లో పర్యాటక భారత జట్టు 0-2తో వెనుకబడింది. గత నెలలోనే ఐర్లాండ్తో జరిగిన ద్వైపాక్షిక సిరీస్లోనూ భారత్ మొదటిసారిగా ఓటమిని చవిచూసింది.
జట్టు పునర్నిర్మాణానికి సమయం పడుతుంది..
మ్యాచ్ అనంతరం జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్లో గంభీర్ మాట్లాడుతూ.. “మేము బాగా ఆడలేదు. ముఖ్యంగా 125 భారీ పరుగుల తేడాతో మాత్రం ఓడిపోతాం అనుకోలేదు.. ఛేదనలో ఆటగాళ్లపై నమ్మకం పెట్టుకున్నాం.. కానీ ఘోరంగా విఫలం అయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే.. టీ20 ప్రపంచ కప్ ఫైనల్ ఆడిన జట్టుతో పోలిస్తే ప్రస్తుత జట్టులో కెప్టెన్, ఓపెనర్లతో సహా చాలా మార్పులు జరిగాయి. హార్దిక్ పాండ్యా, జస్ప్రీత్ బుమ్రా వంటి సీనియర్లు ఈ జట్టులో లేరు. ఒక జట్టును కొత్తగా రీసెట్ చేస్తున్నప్పుడు కాస్త సమయం పడుతుంది. ప్రిన్స్ యాదవ్ తన రెండో అంతర్జాతీయ మ్యాచ్ ఆడుతున్నాడు. హర్షిత్ రాణా గాయం నుంచి కోలుకుని ఇప్పుడే జట్టులోకి వచ్చాడు. అంతర్జాతీయ క్రికెట్లో ఫలితాలు ముఖ్యమే అయినప్పటికీ, ఇలాంటి మార్పుల సమయంలో మనం కాస్త ఆచరణాత్మకంగా ఆలోచించాలి” అని అన్నారు.
పరిస్థితులకు అలవాటు పడలేదు..
ప్రస్తుతం శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో జట్టు నడుస్తోందని, ప్రపంచకప్ అందించిన కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఫామ్ కోల్పోవడం వల్ల ప్రస్తుత టీ20 జట్టులో లేరని గంభీర్ గుర్తుచేశారు. కేవలం నాలుగు మ్యాచ్ల ఫలితాల ఆధారంగానే భారత జట్టును తక్కువ అంచనా వేయలేమని స్పష్టం చేశారు. కొన్నిసార్లు ప్రత్యర్థి జట్టు మనకంటే మెరుగ్గా ఆడుతుందని, ఐర్లాండ్ సిరీస్ నుంచి మనం పరిస్థితులను, పిచ్ వాతావరణాన్ని సరిగ్గా అంచనా వేయలేకపోతున్నామని అంగీకరించారు. వేగంగా మారుతున్న పరిస్థితులకు ఆటగాళ్లు అలవాటు పడాల్సి ఉందన్నారు.
మూడో టీ20లో భారత జట్టు కేవలం 76 పరుగులకే కుప్పకూలింది. జోఫ్రా ఆర్చర్, జోష్ టంగ్ వంటి ఇంగ్లాండ్ ఫాస్ట్ బౌలర్లను ఎదుర్కోవడంలో భారత బ్యాటర్లు పూర్తిగా తడబడ్డారు. దీనిపై గంభీర్ స్పందిస్తూ.. రాబోయే మ్యాచ్ల్లో ఫాస్ట్ బౌలింగ్ను ఎదుర్కొనేందుకు మెరుగైన వ్యూహాలతో బరిలోకి దిగుతామన్నారు. అలాగే టీ20 క్రికెట్లో మైదానం పరిమాణం, గాలి వేగం వంటి చిన్న చిన్న విషయాలు కూడా ఫలితాలను శాసిస్తాయని, వాటిని ఆటగాళ్లు గమనించాలని సూచించారు. అయితే, తన రెండో మ్యాచ్లోనే 30 పరుగులిచ్చి 2 వికెట్లు తీసిన యువ పేసర్ ప్రిన్స్ యాదవ్ ప్రదర్శనను గంభీర్ అభినందించారు. క్లిష్ట సమయాల్లో అతను బౌలింగ్ చేసిన తీరు చూస్తుంటే అతని భవిష్యత్తు చాలా బాగుంటుందని కోచ్ ఆశాభావం వ్యక్తం చేశారు.