Fauzi సెట్లో అసలేం జరిగింది? రాజేష్ శర్మ పురుగు కాటుపై పీఏ వీడియో.. బాధ్యులపై చర్యలు కోరిన AICWA!

పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న ‘ఫౌజీ’ సినిమా షూటింగ్ హాట్ టాపిక్గా మారింది. బాలీవుడ్ సీనియర్ నటుడు రాజేష్ శర్మ (Rajesh Sharma) అస్వస్థతకు గురైన ఘటనపై ఆల్ ఇండియా సినీ వర్కర్స్ అసోసియేషన్ (AICWA) ఉన్నత స్థాయి విచారణ కోరింది. షూటింగ్ సెట్లో అత్యవసర వైద్య సదుపాయాలు, భద్రతా నిబంధనలు సక్రమంగా అమలయ్యాయా అనే అంశాలపై తెలంగాణ ప్రభుత్వం దర్యాప్తు చేపట్టాలని డిమాండ్ చేసింది. రాజేష్ శర్మను పురుగు కుట్టిన తర్వాత తీవ్ర జ్వరం, శ్వాసకోశ సమస్యలు రావడంతో ప్రస్తుతం కోల్కతాలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు సమాచారం. నిర్లక్ష్యం చేసినట్లు నిరూపితమైతే బాధ్యులపై చర్యలు తీసుకోవడంతో పాటు, చికిత్స ఖర్చును నిర్మాతలే భరించాలని AICWA కోరింది.
ఈ క్రమంలోనే ‘ఫౌజీ’ సెట్లో విషపు పురుగు కాటు వార్తలు అవాస్తవం అని, మధుమేహం (డయాబెటిస్) కారణంగానే ఆయన ఆసుపత్రిలో చేరారని రాజేష్ శర్మ పీఏ క్లారిటీ ఇచ్చిన వీడియో సైతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
AICWA: బుధవారం (జులై 8, 2026న) విడుదల చేసిన అధికారిక ప్రకటనలో, షూటింగ్ సమయంలో రాజేష్ శర్మ ఆరోగ్యం ఒక్కసారిగా విషమించిందని, అనంతరం చికిత్స కోసం ఆయన కోల్కతాకు వెళ్లి అక్కడ ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారని AICWA తెలిపింది. ప్రస్తుతం ఆయన వైద్యుల నిరంతర పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారని, ఇంకా పూర్తిగా ప్రమాదం నుంచి బయటపడలేదని పేర్కొంది.
►ALSO READ | హృదయానికి హత్తుకునే ప్రేమ కథ ‘హృదయం మురళి’
ఈ ఘటనకు సంబంధించి పలు కీలక ప్రశ్నలను అసోసియేషన్ లేవనెత్తింది. షూటింగ్ సమయంలో నటుడి పరిస్థితి విషమించినట్లయితే వెంటనే హైదరాబాద్లోని ప్రముఖ ఆసుపత్రిలో ఎందుకు చేర్చలేదని ప్రశ్నించింది. అలాగే షూటింగ్ సెట్లో అత్యవసర వైద్య సదుపాయాలు అందుబాటులో ఉన్నాయా? తప్పనిసరిగా పాటించాల్సిన భద్రత, పరిశుభ్రత, అత్యవసర వైద్య ప్రోటోకాల్స్ను నిర్మాణ సంస్థ అమలు చేసిందా? అనే అంశాలపై సమగ్ర దర్యాప్తు జరపాలని కోరింది.
‘‘ప్రతి కళాకారుడు, సాంకేతిక నిపుణుడు, కార్మికుడికి సురక్షితమైన, పరిశుభ్రమైన, అత్యవసర వైద్య సదుపాయాలతో కూడిన పని వాతావరణాన్ని కల్పించడం చిత్ర పరిశ్రమ యొక్క చట్టపరమైన, నైతిక బాధ్యత. అయితే దేశవ్యాప్తంగా అనేక షూటింగ్ లొకేషన్లలో పరిశుభ్రత లోపించడం, పారిశుద్ధ్య సదుపాయాలు సరిగా లేకపోవడం, భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం, అత్యవసర వైద్య సదుపాయాల కొరత వంటి అంశాలపై AICWA ఇప్పటికే పలుమార్లు ఆందోళన వ్యక్తం చేసింది’’ అని అసోసియేషన్ తన ప్రకటనలో పేర్కొంది.
Date: 08 July 2026
PRESS STATEMENT
AICWA Demands High-Level Investigation into the Sudden Illness of Actor Rajesh Sharma During the Shooting of Prabhas’ Upcoming Film Fauji at Ramoji Film City, Hyderabad
The All Indian Cine Workers Association (AICWA) expresses deep concern… pic.twitter.com/osBW9ro8PM
— All Indian Cine Workers Association (@aicwaofficial) July 8, 2026
షూటింగ్ సెట్లలో ఇలాంటి తీవ్రమైన ఘటనలు జరిగినప్పుడు పూర్తి వివరాలు బయటకు రావడం లేదని కూడా అసోసియేషన్ ఆరోపించింది. ఉద్యోగాలు కోల్పోతామనే భయంతో పలువురు కార్మికులు, టెక్నీషియన్లు నిజాలు బయటపెట్టేందుకు వెనుకాడుతున్నారని పేర్కొంది.
ఈ ఘటనపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే ఉన్నత స్థాయి విచారణకు ఆదేశాలు ఇవ్వాలని AICWA విజ్ఞప్తి చేసింది. రాజేష్ శర్మ ఆరోగ్య సమస్యకు అసలు కారణం ఏమిటి? షూటింగ్ సమయంలో అన్ని భద్రతా, పరిశుభ్రత, అత్యవసర వైద్య నిబంధనలు పాటించారా? నిర్మాతలు, నిర్మాణ సంస్థ లేదా ఇతర బాధ్యుల నిర్లక్ష్యం ఏదైనా ఉందా? అనే కోణాల్లో విచారణ జరపాలని కోరింది.
వైరల్ అవుతున్న ఇన్సిడెంట్?
సీనియర్ నటుడు రాజేష్ శర్మ ఫౌజీ’ సెట్లో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్ అనంతరం దట్టమైన చెట్లు ఉన్న ప్రాంతంలో స్థానిక సాంకేతిక నిపుణులతో ఆయన మాట్లాడుతుండగా ఒక విషకీటకం లేదా విషపు సాలీడు ఆయన కాలికి కుట్టినట్లు సమాచారం. అనంతరం తీవ్ర జ్వరం, ఇన్ఫెక్షన్, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తడంతో కోల్కతాలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి ఇంకా విషమంగానే ఉందని, వైద్యుల నిరంతర పర్యవేక్షణలో ఉన్నారని నటి సుదీప ఛటర్జీ తెలిపారు.
విషపు పురుగు కాటు వార్తలు అవాస్తవం: పీఏ క్లారిటీ
‘ఫౌజీ’ సినిమా షూటింగ్లో రాజేష్ శర్మకు విషపు పురుగు కాటేసిందన్న వార్తలను ఆయన వ్యక్తిగత సిబ్బంది ఖండించారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని పీఏ సుభాశిష్ పాండా తెలిపారు. రాజేష్ శర్మ అస్వస్థతకు గురైన మాట నిజమేనని, అయితే అది పురుగు కాటు వల్ల కాదని స్పష్టం చేశారు. మధుమేహం (డయాబెటిస్) కారణంగానే ఆయన ఆసుపత్రిలో చేరారని, ప్రస్తుతం ఆరోగ్యం మెరుగుపడిందని, గురువారం డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉందని వెల్లడించారు.
Actor #RajeshSharma Asst saying all social media is fake and that he got admitted due to Diabetes and doctors have said he will be discharged tomorrow. #Fauzi pic.twitter.com/RsB0aPEAZv
— Suresh PRO (@SureshPRO_) July 8, 2026
ఎవరీ రాజేష్ శర్మ?
నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా (NSD) పూర్వ విద్యార్థి అయిన రాజేష్ శర్మ, ఇండియన్ సినీ ఇండస్ట్రీలో అత్యంత ప్రతిభావంతమైన క్యారెక్టర్ ఆర్టిస్టుల్లో ఒకరిగా గుర్తింపు పొందారు. ‘ఖోస్లా కా ఘోస్లా’, ‘ది డర్టీ పిక్చర్’, ‘స్పెషల్ 26’, ‘ఎం.ఎస్. ధోని: ది అన్టోల్డ్ స్టోరీ’, ‘టాయిలెట్: ఏక్ ప్రేమ్ కథ’, ‘తను వెడ్స్ మను’, ‘పికు’, ‘మర్దానీ 2’, ‘క్రూ’ వంటి అనేక విజయవంతమైన చిత్రాల్లో ఆయన నటించి ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు.