Suhas Murder : డబ్బుల గొడవతోనే అర్ధరాత్రి పిలిచి స్నేహితుడి హత్య..

హయత్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పసుమాముల వద్ద మూడు రోజుల క్రితం అనుమానాస్పద స్థితిలో శవమై కనిపించిన యువకుడు సుహాస్ కేసును పోలీసులు విజయవంతంగా ఛేదించారు. తోటి స్నేహితులే అతడిని దారుణంగా హత్య చేసి, రోడ్డు పక్కన ఉన్న సిమెంట్ బెంచ్పై పడుకోబెట్టి ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేశారని, సిసిటివి (CCTV) ఫుటేజీల ఆధారంగా నిందితులను గుర్తించామని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై సుహాస్ తల్లి ,స్నేహితురాలు ఎన్టీవీతో మాట్లాడుతూ.. మూడు రోజుల క్రితం అర్ధరాత్రి రెండు గంటల ప్రాంతంలో రాకేష్ గౌడ్, పరశురామ్, రాజు అనే స్నేహితులు ఇన్స్టాగ్రామ్లో ఫోన్ చేశారని, కాల్ లిఫ్ట్ చేయకపోవడంతో ఏకంగా ఇంటికే వచ్చి ఐదు నిమిషాల్లో పంపుతామని నమ్మించి బండిపై తీసుకెళ్లారని కన్నీరుమున్నీరయ్యారు. వెళ్లొద్దని ఎంత బ్రతిమిలాడినా వినకుండా తీసుకెళ్లి, మరుసటి రోజు ఉదయానికి శవంగా మార్చారని ఆవేదన వ్యక్తం చేశారు.
రాకేష్ గౌడ్కు చెందిన డబ్బుల వ్యవహారంలో వచ్చిన గొడవలే ఈ దారుణ హత్యకు కారణమని బాధితుడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. తన డబ్బును సుహాస్ తీసుకున్నాడనే అనుమానంతోనే రాకేష్ తన అనుచరులతో కలిసి ఈ ఘాతుకానికి ఒడిగట్టాడని, నమ్మి వెళ్లిన స్నేహితుడిని ఇంత దారుణంగా చంపిన నిందితులను కఠినంగా శిక్షించాలని సుహాస్ తల్లి డిమాండ్ చేశారు. నిందితులు సుహాస్ను కొట్టి చంపిన అనంతరం మృతదేహాన్ని పసుమాముల వద్ద సిమెంట్ బెంచ్పై పడుకోబెట్టి పారిపోయినట్లు విచారణలో తేలింది. ప్రస్తుతం నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తును వేగవంతం చేశారు.