Viral Video: ‘గ్రౌండ్లో పరుగెత్తలేను.. నేను ముసలివాడిని అయిపోయాను’: ఎంఎస్ ధోనీ

భారత క్రికెట్ దిగ్గజం, మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయన మైదానంలో ఉన్నా, స్టాండ్స్లో కూర్చున్నా అభిమానులు పండగ చేసుకుంటారు. తాజాగా ధోని తన 45వ పుట్టినరోజును నాటింగ్హామ్లోని ట్రెంట్ బ్రిడ్జ్ స్టేడియంలో చాలా ప్రత్యేకంగా జరుపుకున్నారు. భారత్-ఇంగ్లండ్ మధ్య జరిగిన మూడో టీ20 మ్యాచ్ను వీక్షించేందుకు ఆయన స్టేడియానికి విచ్చేశారు.
ధోని స్టేడియంలో ప్రత్యక్షం కాగానే అభిమానుల కేరింతలతో నాటింగ్హామ్ హోరెత్తిపోయింది. పెద్ద స్క్రీన్పై ఆయనను చూపించినప్పుడు స్టేడియం మొత్తం ‘ధోని.. ధోని..’ అంటూ నినదించింది. ఈ క్రమంలో ధోని చేసిన ఒక సరదా సైగ ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. అభిమానులు ఆయనను మళ్లీ బ్యాటింగ్ చేయమని కోరగా.. తను ఇప్పుడు ముసలివాడిని అయిపోయానని, ఒకవేళ బ్యాటింగ్ చేయడానికి క్రీజులోకి వస్తే వికెట్ల మధ్య వేగంగా పరిగెత్తడం తన వల్ల కాదంటూ ధోని నవ్వుతూ చేతులతో సైగలు చేశారు. ఈ వీడియో నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటోంది.
MS Dhoni at Trent Bridge to watch the India vs England match.
Had some fun interactions with fans.
pic.twitter.com/X7ddClMBY2
— Rohit Nation (@Rohitnation45) July 7, 2026
భారత్కు చారిత్రాత్మక ఘోర పరాజయం..
ధోని ఉత్సాహపరిచినప్పటికీ, మైదానంలో భారత జట్టు మాత్రం అత్యంత పేలవ ప్రదర్శనతో నిరాశపరిచింది. మూడో టీ20లో ఇంగ్లండ్ చేతిలో భారత్ 125 పరుగుల భారీ తేడాతో చారిత్రాత్మక ఓటమిని చవిచూసింది. టీ20 అంతర్జాతీయ క్రికెట్ చరిత్రలో పరుగుల పరంగా భారత్కు ఇదే అతిపెద్ద ఓటమి కావడం గమనార్హం.
మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ జట్టు ఫిల్ సాల్ట్ (44 బంతుల్లో 70 రన్స్) మెరుపులతో నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లకు 201 పరుగుల భారీ స్కోరు చేసింది. అనంతరం 202 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టు.. ఇంగ్లండ్ పేసర్లు జోఫ్రా ఆర్చర్ (3/29), జోష్ టంగ్ (4/28) ధాటికి తట్టుకోలేక కేవలం 11.4 ఓవర్లలోనే 76 పరుగులకే కుప్పకూలింది.
ఐపీఎల్ స్టార్లుగా పేరొందిన భారత బ్యాటర్లు చేతులెత్తేయడంతో కేవలం 5 ఓవర్లలోనే 52 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి తీవ్ర ఒత్తిడిలో పడింది. వైభవ్ సూర్యవంశీ (13), అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్ వంటి ప్రముఖ ఆటగాళ్లంతా బాధ్యతారహితమైన షాట్లు ఆడి వికెట్లు పారేసుకున్నారు. కేవలం నలుగురు బ్యాటర్లు మాత్రమే రెండంకెల స్కోరు చేయగలిగారు. మొదటి మ్యాచ్ వర్షం వల్ల రద్దు కాగా, తర్వాతి రెండు మ్యాచ్లు గెలిచిన ఇంగ్లండ్ ఐదు మ్యాచ్ల సిరీస్లో 2-0తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.

