July 10, 2026

ఒక్క మటన్ ముక్క కోసం పెళ్లిలో ఎంత పని జరిగింది.. ఆసుపత్రి పాలైన ఆరుగురు..!

ఒక్క మటన్ ముక్క కోసం పెళ్లిలో ఎంత పని జరిగింది.. ఆసుపత్రి పాలైన ఆరుగురు..!
Reading Time: 2 minutes
ఒక్క మటన్ ముక్క కోసం పెళ్లిలో ఎంత పని జరిగింది.. ఆసుపత్రి పాలైన ఆరుగురు..!

బీహార్‌లోని సహర్సా జిల్లాలో ఒక వివాహ వేడుక రణరంగంగా మారింది. వివాహానంతరం ఏర్పాటు చేసిన విందులో వడ్డించిన ఆహారం విషయంలో తలెత్తిన చిన్న వివాదం.. చివరకు పెద్ద హింసాత్మక ఘర్షణకు దారితీసింది. తమకు పెళ్లిలో మటన్ వడ్డిస్తామని వాగ్దానం చేసి, భోజనాల సమయంలో ప్లేట్లలో చికెన్ వడ్డించారంటూ వరుడి తరఫు వారు నిలదీశారు. ఈ మెనూ మార్పుపై మొదలైన వాగ్వాదం కాస్తా ఇరుపక్షాల మధ్య దాడులకు కారణమైంది. ఈ ఘర్షణలో వరుడి తరఫున వచ్చిన ఆరుగురికి పైగా బంధువులు తీవ్రంగా గాయపడ్డారు.

సిమ్రి బఖ్తియార్‌పూర్ మున్సిపల్ కౌన్సిల్ పరిధిలోని 12వ వార్డు, బల్వాపర్‌కు చెందిన మహమ్మద్ అన్వర్ కుమారుడు మహమ్మద్ అబ్దుల్లా అలియాస్ చంద్‌కు, మహిసి బ్లాక్‌లోని రాజన్‌పూర్‌కు చెందిన మహమ్మద్ జావేద్ అలియాస్ మోటో కుమార్తెతో వివాహం నిశ్చయమైంది. గురువారం (జూలై 09) మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో ఇరు కుటుంబాల సమక్షంలో సాంప్రదాయబద్ధంగా, ప్రశాంతంగా వివాహ వేడుక జరిగింది. వివాహం ముగిసిన వెంటనే వధూవరులతో పాటు వచ్చిన అతిథుల కోసం విందు భోజనాలు ప్రారంభమయ్యాయి.

భోజనాలకు కూర్చున్న సమయంలో వరుడి తరఫు వారు మెనూపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. పెళ్లికి ముందు తమకు మేక మాంసం పెడతామని ఒప్పందం చేసుకున్నారని, కానీ ఇక్కడ చికెన్ వడ్డించి అవమానించారని వధువు తరఫు వారితో గొడవకు దిగారు. ఇరుపక్షాల మధ్య మాట మాట పెరిగి అది కాస్తా పరస్పర దాడులకు దారితీసింది. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. ఇరువర్గాల వారు ఒక్కసారిగా పిడిగుద్దులు, కాళ్లతో తన్నుకోవడమే కాకుండా.. అక్కడే ఉన్న కర్రలు, పదునైన ఆయుధాలతో ఒకరిపై ఒకరు విచక్షణారహితంగా దాడి చేసుకున్నారు. దీంతో పెళ్లి పందిరంతా గందరగోళంగా మారి, అతిథులు ప్రాణభయంతో చెల్లాచెదురుగా పారిపోయారు.

ఈ ఆకస్మిక ఘర్షణలో పెళ్లికొడుకు తరఫున వచ్చిన బంధువులు మహమ్మద్ ఆషిక్, మహమ్మద్ ఇర్ఫాన్, మహమ్మద్ హసన్, మహమ్మద్ అబ్బాస్, మహమ్మద్ జబ్బార్, మహమ్మద్ ఆతిఫ్, మహమ్మద్ మెహబూబ్ తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఎక్కువ మంది బల్వపార్ వార్డ్ నెం. 12 నివాసితులు. గాయపడిన వారందరినీ వెంటనే చికిత్స నిమిత్తం సిమ్రి బఖ్తియార్‌పూర్ సబ్-డివిజనల్ ఆసుపత్రికి తరలించారు.

వధువు తరఫు వారు మెనూ నిబంధనలను ఉల్లంఘించడమే కాకుండా, తాము నిరసన తెలిపినందుకు కిరాతకంగా దాడి చేశారని వరుడి మామ మహమ్మద్ ఇర్ఫాన్ ఆరోపించారు. ఈ ఘర్షణతో ఆ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఇరు పక్షాల నుంచి వాంగ్మూలాలు నమోదు చేసుకున్నామని, దర్యాప్తు పూర్తి చేసి బాధ్యులపై కఠిన న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని పోలీస్ అధికారులు వెల్లడించారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..