Reading Time: < 1 minute
Owaisi Assam Rifles Rss Linked Seminar Security Establishment

Asaduddin Owaisi: రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(RSS) అనుబంధ సంస్థతో అస్సాం రైఫిల్స్ కలిసి నిర్వహించి ఒక సెమినార్ చర్చనీయాంశంగా మారింది. ఈ కార్యక్రమంపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ కీలక ప్రశ్నలు లేవనెత్తారు. భారత భద్రతా వ్యవస్థపై అధికార పార్టీ సిద్ధాంతం ప్రభావం చూపుతోందా.? అని ఆందోళన వ్యక్తం చేశారు. ఆర్ఎస్ఎస్‌ను బీజేపీ మాతృసంస్థగా భావిస్తారు. అస్సాం రైఫిల్స్ భారతదేశంలోని ఈశాన్య ప్రాంతంలో అంతర్గత భద్రత, సరిహద్దును నిర్వహిస్తోంది.

జూన్ 17, 18 తేదీల్లో గౌహతిలో ‘భారత్-మయన్మార్ సరిహద్దు సమస్యలు మరియు భవిష్యత్ కార్యాచరణ’ అంశంపై సెమినార్ జరిగింది. ఈ కార్యక్రమాన్ని అస్సాం రైఫిల్స్‌తో పాటు సీమంత్ చేతనా మంచ్-నార్త్ ఈస్ట్ సంయుక్తంగా నిర్వహించినట్లు నివేదికలు పేర్కొన్నాయి. సీమంత్ చేతనా మంచ్ తనను తాను ఒక సామాజిక, సాంస్కృతిక, రాజకీయేతర సంస్థగా పేర్కొన్నప్పటికీ, ఇది ఆర్ఎస్ఎస్ అనుబంధ లేదా దాని భావజాలానికి దగ్గరగా ఉన్న సంస్థగా భావిస్తుంటారు.

ఈ సెమినార్‌పై ఓవైసీ సోషల్ మీడియాలో స్పందించారు. ‘‘భారతీయ జనతా పార్టీకి సైద్ధాంతిక మాతృసంస్థ అయిన ఆర్ఎస్ఎస్ తో రాష్ట్ర భద్రతా దళాల మధ్య పెరుగుతున్న సమన్వయం భారత భద్రతా వ్యవస్థను, ఆలోచనా విధానాన్ని ప్రభావితం చేస్తోందనే అనుమానాలకు తావిస్తోంది’’ అని ఆయన ఎక్స్‌లో అన్నారు. ఈ సెమినార్‌కు నాగాలాండ్ మంత్రి టెంజెన్ ఇమ్నా అలోంగ్ హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ.. సరిహద్దు దేశాలను విభజించవు, అదే దేశ భద్రతను, గుర్తింపును నిర్వచిస్తాయి అని అన్నారు.