July 9, 2026

సికింద్రాబాద్ స్టేషన్‌లో కలకలం.. భార్య కళ్లెదుటే ప్రియురాలితో కలిసి భర్త ఆత్మహత్యాయత్నం..!

సికింద్రాబాద్ స్టేషన్‌లో కలకలం.. భార్య కళ్లెదుటే ప్రియురాలితో కలిసి భర్త ఆత్మహత్యాయత్నం..!
Reading Time: < 1 minute
సికింద్రాబాద్ స్టేషన్‌లో కలకలం.. భార్య కళ్లెదుటే ప్రియురాలితో కలిసి భర్త ఆత్మహత్యాయత్నం..!

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో శబరి ఎక్స్‌ప్రెస్ రైలులో ఒక వింత, దిగ్భ్రాంతికర ఘటన చోటు చేసుకుంది. కొంతకాలంగా తన ప్రియురాలు నీలవేణితో కలిసి కోయంబత్తూర్‌లో నివసిస్తున్నాడు శిరీష్ అనే వ్యక్తి. విషయం తెలిసిన శిరీష్ భార్య కోయంబత్తూర్ వెళ్లి భర్తను, అతని ప్రియురాలిని హైదరాబాద్ తీసుకువస్తోంది. ఇంతలో తన భార్య కళ్లెదుటే ప్రియురాలితో కలిసి విషం తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఇందుకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

పోలీసుల కథనం ప్రకారం.. ఉద్యోగరీత్యా శిరీష్ కోయంబత్తూరులో ఉంటున్నాడు. అక్కడే మరో యువతితో ప్రేమాయణం కొనసాగిస్తున్నాడు. అయితే తనను వదిలేసి కోయంబత్తూర్‌లో ప్రియురాలితో ఉంటున్నాడనే విషయం తెలుసుకున్న అతని భార్య, అక్కడికి చేరుకుంది. పంచాయితీ అనంతరం భర్తను, అతని ప్రియురాలిని ఇద్దరినీ కలిసి హైదరాబాద్‌కు తీసుకురావడానికి ఆమె శబరి ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణమయ్యారు. రైలు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు చేరుకోవడానికి మరో ఐదు నిమిషాలు మాత్రమే సమయం ఉందనగా, శిరీష్, అతని ప్రియురాలు నీలవేణి ఇద్దరూ ముందస్తు ప్రణాళికతో వెంట తెచ్చుకున్న విషాన్ని భార్య ముందే తాగేశారు.

రైలు ప్లాట్‌ఫారమ్‌పైకి రాగానే వారు స్పృహతప్పి పడిపోవడంతో భార్య గట్టిగా కేకలు వేసింది. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు తక్షణమే స్పందించి, బాధితులిద్దరినీ అత్యవసర చికిత్స నిమిత్తం సికింద్రాబాద్‌లోని గాంధీ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. కుటుంబ కలహాలు, వివాహేతర సంబంధమే ఈ ఘోరానికి కారణమని భావిస్తున్న రైల్వే పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..