USA: అమెరికాలో భార్యను హత్య చేసిన తెలంగాణ టెక్కీ.. జీవితఖైదు పడే అవకాశం

USA: అమెరికాలో టెక్కీగా పనిచేస్తున్న తెలంగాణ వ్యక్తిపై హత్య కేసు నమోదైంది. తెలంగాణకు చెందిన సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఇంజనీర్ అవినాష్ నార్నే(30), 27 ఏళ్ల భార్య రాజిత సబ్బినేనిని హత్య చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. అక్టోబర్ 2025లో రాజిత మరణించింది. భారతదేశంలో వేరే యువతితో ప్రేమాయణం కొనసాగిస్తున్న అవినాష్, పథకం ప్రకారం భార్యను హత్య చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. అవినాష్, తన భార్య మరణించిన తర్వాతి రోజే ఆమె డెడ్బాడీ ఫోటోలను ప్రియురాలికి పంపినట్లు అంగీకరించాడని ఛార్జిషీట్ను ప్రస్తావిస్తూ స్థానిక మీడియా చెప్పింది.
అవినాష్ వాషింగ్టన్ రాష్ట్రంలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడు. పెళ్లైన ఆరు నెలల తర్వాత ఆయన భారత్య అపార్ట్మెంట్లో అనుమానాస్పదంగా మరణించింది. ఈ మరణంపై చాలా అనుమానాలు వ్యక్తమయ్యాయి. దాదాపుగా 9 నెలల పాటు సాగిన దర్యాప్తు తర్వాత అవినాష్ను అరెస్ట్ చేసి, పోలీసులు ఫస్ట్ డిగ్రీ మర్డర్ కేసు నమోదు చేశారు.
బాత్రూంలో మృతదేహం, అవినాష్ నాటకం:
ఘటన జరిగిన రోజు, తన భార్య బాత్రూంకు వెళ్లి బయటకు రావడం లేదని అవినాష్ పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పోలీసులు తలుపులు బద్దలుకొట్టి లోపలికి వెళ్లగా రాజిత అప్పటికే మరణించి కనిపించింది. అయితే, పోస్టుమార్టం రిపోర్టులో గొంతు నులిమి ఊపిరాడకుండా చేయడం వల్ల ఆమె మరణించినట్లు తేలింది. దీంతో హత్య కేసు నమోదు చేశారు. అవినాష్ తన భార్య చనిపోయే ముందు బయటకు వెళ్లి వచ్చినట్లు చెప్పారు. అప్పటికే తన భార్య బాత్రూమ్లో ఉన్నట్లు చెప్పాడు. అయితే, అపార్ట్మెంట్ స్మార్ట్ లాక్, సెక్యూరిటీ సిస్టమ్ డేటాను పరిశీలించిన పోలీసులు, ఇంట్లోకి ఎవరూ వెళ్లలేదని నిర్ధారించుకున్నారు. దీంతో గుర్తుతెలియని వ్యక్తి హత్య చేశాడనే ఆరోపణల్ని తోసిపుచ్చారు.
సీక్రెట్ లవ్ వ్యవహారమే కారణమా.?
దర్యాప్తులో అవినాష్ కు భారత్లో మరో యువతితో ప్రేమాయణం ఉన్నట్లు తేలింది. పెళ్లికి ముందు నుంచే ఈ వ్యవహారం నడుస్తోంది. పెళ్లి తర్వాత కూడా అవినాష్ ఆమెతో మాట్లాడినట్లు కాల్ రికార్డులు వెల్లడించాయి. సదరు ప్రేయసి వీరిద్దరి పెళ్లికి హాజరైనట్లు కోర్టు పత్రాల్లో ఉంది. రాజిత మరణించిన రోజే సదరు యువతికి అవినాష్ నాలుగు సార్లు ఫోన్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. రాజిత మృతదేహం ఫోటోను మరుసటి రోజే పంపినట్లు అవినాష్ అంగీకరించినట్లు ఛార్జిషీట్ పేర్కొంది.
భర్తపై అనుమానం..?
రాజిత మరణానికి కొన్ని వారాల ముందు నుంచే తన భర్తపై అనుమానాలు ఉన్నట్లుగా కొన్ని సంఘటనలు వెల్లడిస్తున్నాయి. భర్త తయారు చేసి ఇచ్చే డ్రింక్స్ రుచి అసాధారణంగా ఉన్నట్లు పలుమార్లు రాజిత్ పదే పదే చెప్పింది. ఆమె మరణించిన రోజు, నార్నే తయారుచేసిన స్మూతీ “దగ్గు మందు” లాగా ఉందని ఆమె అతనికి చెప్పినట్లు ఆరోపణలు ఉన్నాయి.
9 నెలల దర్యాప్తు..
సుమారు 9 నెలల పాటు జరిగిన దర్యాప్తు తర్వాత అవినాష్పై ఫస్ట్ డిగ్రీ మర్డర్ కేసుల పెట్టారు. ఇన్నాళ్లు సాగిన దర్యాప్తులో డిజిటల్ సాక్ష్యాలు, కాల్ రికార్డులు, ఇతర సాక్ష్యాలను పరిశీలించిన పోలీసులు అవినాష్ను అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం అతను 5 మిలియన్ డాలర్ల (సుమారు రూ.48 కోట్ల) బెయిల్పై జైలులో ఉన్నాడు. నేరం రుజువైతే అమెరికా వాషింగ్టన్ రాష్ట్ర చట్టాల ప్రకారం జీవిత ఖైదు పడే అవకాశం ఉంది.