Kadiyam Srihari: “నేనేం తప్పు చేయలేదు”.. మంత్రి కొండా సురేఖ లేఖపై స్పందించిన కడియం శ్రీహరి

Kadiyam Srihari: రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ తనకు రాసిన లేఖపై స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఘాటుగా స్పందించారు. రాజకీయాల్లో కొంతమంది కొత్త అలవాట్లు నేర్చుకుంటున్నారని మండిపడ్డారు. నియోజకవర్గాల అభివృద్ధిని పట్టించుకోని వాళ్లు, నిరంతరం ప్రజల మధ్య ఉండని వాళ్లు.. ఇలాంటి ఏదో ఒక వివాదాన్ని సృష్టించి వార్తల్లో నిలిచేందుకు, ప్రజల్లో ఉండేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. ఈ వివాదంపై తాను ఎవరికీ ఎలాంటి వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదని, ఎందుకంటే తాను ఏ తప్పూ చేయలేదని ఆయన స్పష్టం చేశారు. ప్రజాప్రతినిధులుగా ప్రజల సమస్యల పరిష్కారం కోసం ఉన్నతాధికారులను కలిసి మాట్లాడే పూర్తి అధికారం తమకు ఉంటుందని, అధికారులను కలవడం ప్రజాప్రతినిధుల ప్రాథమిక హక్కు అని కడియం శ్రీహరి గుర్తుచేశారు. ఆ ప్రోటోకాల్ పరిధికి లోబడే తాను స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గానికి సంబంధించిన పలు ఆలయాల అభివృద్ధిపై, ఆయా దేవాలయాల ఛైర్మన్లతో కలిసి దేవాదాయ శాఖ కమిషనర్ను వ్యక్తిగతంగా కలిసి రిప్రజెంటేషన్ అందజేశానని వివరించారు. కేవలం తన నియోజకవర్గ పరిధిలోని ఆలయాల సమస్యల గురించే తాను మాట్లాడానని, అంతేకానీ ఉమ్మడి వరంగల్ జిల్లా లేదా తెలంగాణ రాష్ట్రంలోని ఆలయాలపై తాను ఎలాంటి అధికారిక సమీక్ష నిర్వహించలేదని స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా సమీక్షకు, వినతిపత్రం ఇవ్వడానికి ఉన్న తేడాను కడియం శ్రీహరి ప్రస్తావించారు. “అధికారులు నా దగ్గరకు వస్తే దాన్ని సమీక్ష అంటారు.. అదే నేను అధికారుల ఆఫీసుకి వెళితే దాన్ని రిప్రజెంటేషన్ ఇచ్చినట్టుగా భావించాలి.. ఇది కనీస అవగాహన లోపం” అంటూ ఎద్దేవా చేశారు. మంత్రి తనను పూర్తిగా తప్పుగా అర్థం చేసుకున్నారని, తాను ఎలాంటి నిబంధనల ఉల్లంఘన చేయనప్పుడు ఇక వివరణ ఇచ్చే ప్రసక్తి ఎక్కడి నుంచి వస్తుందని ప్రశ్నించారు. ఇలాంటి అనవసర వివాదాలు పక్కన పెట్టి, పాలకులు వరంగల్ నగర అభివృద్ధి, ప్రజల సంక్షేమంపై దృష్టి పెట్టాలని కడియం శ్రీహరి సూచించారు. ప్రస్తుతం జిల్లాలో తీవ్రమైన వర్షాభావ పరిస్థితులు ఉన్నాయని, దేవాదుల ప్రాజెక్టు ద్వారా రైతులకు సాగునీరు అందించే విషయంపై ప్రభుత్వం ఆలోచించాలని కోరారు. అలాగే వరంగల్ ఎంజీఎం (MGM) ఆసుపత్రికి పూర్తిస్థాయి సూపరింటెండెంట్ లేరని, నూతన సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ఇంకా ప్రారంభానికి నోచుకోలేదని గుర్తుచేశారు. నగరంలో అధ్వానంగా ఉన్న అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థను బాగు చేయడం వంటి ప్రజా సమస్యలపై మంత్రి దృష్టి సారిస్తే బాగుంటుందని కడియం శ్రీహరి హితవు పలికారు.