AP Cabinet : ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.. ఇకపై ఆ విద్యార్దులకు IIT, JEE, NEET కోచింగ్ ఫ్రీ..

రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతి, పర్యాటక రంగ అభివృద్ధి, నిరుపేద విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్య అందించడమే లక్ష్యంగా ఏపీ కేబినెట్ పలు ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది. ఈ సందర్భంగా సమావేశంలో తీసుకున్న ముఖ్య నిర్ణయాలను మంత్రి పార్థసారధి మీడియాకు వెల్లడించారు. రూ.11,569.91 కోట్ల భారీ పెట్టుబడుల ద్వారా రాష్ట్రంలో కొత్తగా 31,431 మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయని ఆయన తెలిపారు. చిత్తూరులో మోండెలీజ్ ఇండియా ఫుడ్స్ సంస్థ రూ.1,801 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని.. ఈ యూనిట్కు టెక్నాలజీ అప్గ్రేడేషన్, విద్యుత్ సబ్సిడీ వంటి ప్రత్యేక ప్రోత్సాహకాలను అందించనున్నట్టు తెలిపారు. తద్వారా కోకో ఆధారిత చాక్లెట్ తయారీలో ఆంధ్రప్రదేశ్ను దేశంలోనే నంబర్-1 స్థానంలో నిలపాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందన్నారు.
పర్యావరణ పరిరక్షణలో భాగంగా వేస్ట్ ఆయిల్తో నడిచే సస్టైనబుల్ ఏవియేషన్ ఫ్యూయల్ ప్రాజెక్టుకు కూడా క్యాబినెట్ ప్రత్యేక ప్రోత్సాహకాలను ఆమోదించిందని తెలిపారు. అలాగే రాష్ట్రాన్ని అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు టూరిజం పాలసీలో ప్రభుత్వం కీలక సవరణలు చేసిందన్నారు. భారీ కన్సర్ట్లు, ఇంటర్నేషనల్ కార్నివల్స్ నిర్వహణను ప్రోత్సహించేందుకు సరికొత్తగా వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ విధానాన్ని ప్రవేశపెట్టామన్నారు. 20 వేల మంది వరకు హాజరయ్యే ఈవెంట్లకు రూ.2 కోట్ల VGF అందిస్తారని.. 20 వేల నుంచి 50 వేల మంది వరకు హాజరైతే రూ.5 కోట్ల VGF సహాయం ఉంటుందని స్పష్టం చేశారు. ఈ భారీ ఈవెంట్ల నిర్వహణ కోసం అవసరమైతే ప్రభుత్వ మైదానాలను ఉచితంగా కేటాయించనున్నట్లు పేర్కొన్నారు.. రాష్ట్ర ప్రతిష్టను పెంచే హై ఇంపాక్ట్ టూరిజం ప్రాజెక్టులకు ప్రభుత్వం అగ్రప్రాధాన్యం ఇవ్వనుందన్నారు.
పేద, వెనుకబడిన వర్గాల విద్యార్థులకు నాణ్యమైన ఉన్నత విద్యను అందించేందుకు క్యాబినెట్ చారిత్రాత్మక నిర్ణయం తీసుకుందని మంత్రి తెలిపారు. విశాఖపట్నం, నెల్లూరు, అంబేద్కర్ కోనసీమ జిల్లాల్లో 3 సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటుకు ఆమోదం లభించిందని.. ఈ సెంటర్ల ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులకు ఐఐటీ-జేఈఈ ,నీట్ (NEET) పరీక్షల కోసం ఉచితంగా రెసిడెన్షియల్ కోచింగ్ ఇస్తారన్నారు. నాణ్యమైన ఫ్యాకల్టీ, అత్యాధునిక సౌకర్యాలతో గురుకుల హాస్టళ్లను పూర్తిస్థాయి రెసిడెన్షియల్ స్కూళ్లుగా మార్చేలా చర్యలు చేపట్టబోతున్నట్టు తెలిపారు.
ఐటీ రంగానికి సంబంధించి గతంలో అభివృద్ధి కోసం కేటాయించిన రూ.75 కోట్ల బడ్జెట్ను రూ.50 కోట్లకు సవరిస్తూ క్యాబినెట్ ఆమోదం తెలిపిందని..
విద్యార్థులకు కేవలం ఉన్నత విద్యను అందించడమే కాకుండా, వారిని గ్లోబల్ మార్కెట్కు అనుగుణంగా తీర్చిదిద్దేందుకు స్కిల్ డెవలప్మెంట్ పై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని మంత్రి పార్థసారధి ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.