Team India: భారత టీ20 జట్టులో మార్పులు.. ఐదో టీ20కి సంజూ శాంసన్ ఎంట్రీ..? టీం నుంచి ఇద్దరు అవుట్..

టీ20 ప్రపంచ కప్ విజయం తర్వాత సూర్యకుమార్ యాదవ్ నుండి భారత టి20 జట్టు సారథ్య బాధ్యతలు చేపట్టిన శ్రేయస్ అయ్యర్కు ఇప్పటివరకు కెప్టెన్గా ఆశించిన విజయాలు దక్కలేదు. ఐర్లాండ్ చేతిలో 0-2తో సిరీస్ ఓడిపోయిన భారత్, ఆ తర్వాత ఇంగ్లాండ్తో జరిగిన మొదటి మ్యాచ్ వర్షార్పణం కాగా, ఆపై వరుసగా మూడు మ్యాచ్లు ఓడిపోయి 5 మ్యాచ్ల సిరీస్లో 0-3తో వెనుకబడింది. ఈ నేపథ్యంలో భారత మాజీ వికెట్ కీపర్ సబా కరీమ్ మాట్లాడుతూ.. అయ్యర్ ఐపీఎల్లో చూపించిన వ్యూహాత్మక చతురతను జాతీయ జట్టుకు కూడా వర్తింపజేస్తూ అంతర్జాతీయ క్రికెట్లో తన కెప్టెన్సీ ముద్రను స్పష్టంగా చూపించాల్సిన సమయం ఆసన్నమైందని అభిప్రాయపడ్డారు. ఐపీఎల్లో మనం చూసిన అయ్యర్ వ్యూహాలకు, ప్రస్తుత అంతర్జాతీయ మ్యాచ్లలోని అతని నిర్ణయాలకు పొంతన లేదని, ముఖ్యంగా అయ్యర్ మిడిల్ ఆర్డర్లో ఆడుతున్నప్పుడు శివం దూబేను ఐదో నంబర్లో బ్యాటింగ్కు పంపడం అసలు అర్థం లేని నిర్ణయమని ఆయన విమర్శించారు.
అయితే అయ్యర్ స్వయంగా బ్యాటింగ్లో రాణిస్తూ పరుగులు చేయడం జట్టుకు అతిపెద్ద సానుకూలాంశమని, కెప్టెన్ బాగా ఆడితే ఆత్మవిశ్వాసం పెరిగి కప్టెన్సీ కూడా మెరుగవుతుందని ఆయన ప్రశంసించారు. ఇంగ్లాండ్తో జరిగే ఐదో టి20 మ్యాచ్ కోసం భారత జట్టులో కీలక మార్పులు చేయాలని సబా కరీమ్ సూచించారు. జట్టులో వరుసగా ఎడమచేతి వాటం బ్యాటర్లు వస్తుండటాన్ని నివారించడానికి మిడిల్ ఆర్డర్లో ఒక అనుభవజ్ఞుడైన కుడిచేతి వాటం బ్యాటర్ అవసరమని, అందుకు సంజూ శాంసన్ అత్యంత సరైన ప్రత్యామ్నాయమని పేర్కొన్నారు. ఒకవేళ మేనేజ్మెంట్ తిలక్ వర్మను జట్టులో కొనసాగించాలనుకుంటే, శివం దూబే స్థానంలో సంజూ శాంసన్ను చేర్చడం ద్వారా బ్యాటింగ్ లైనప్ను మరింత బలోపేతం చేయవచ్చని చెప్పారు.
అలాగే వాషింగ్టన్ సుందర్ స్థానంలో సూర్యాంశ్ షెడ్గేకు అవకాశం ఇవ్వాలని, అతను మీడియం పేస్ బౌలింగ్తో రెండు మూడు ఓవర్లు వేసి ఆరో బౌలర్ పాత్రను పోషించగలడని తెలిపారు. భారత ఆటగాళ్లు ఇంకా ఐపీఎల్ లోని ఫ్లాట్ పిచ్లు, చిన్న బౌండరీల మానసిక స్థితి నుండి బయటకు రాలేకపోతున్నారని, భారత్లోని చిన్న మైదానాల్లో ఆడుతున్నట్లే ఇక్కడ కూడా షాట్లు ఆడుతూ వికెట్లు పారేసుకుంటున్నారని, ఒక ప్రపంచ కప్ విజేత జట్టు నుండి ఇలాంటి బాధ్యతారహితమైన క్రికెట్ను ఎవరూ ఆశించరని కరీమ్ తీవ్రంగా విమర్శించారు.