Bigg Boss Telugu 10: బిగ్ బాస్ కంటెస్టెంట్లకు బిగ్ షాక్.. రూల్ బ్రేక్ చేస్తే రెమ్యునరేషన్లో కోత.. ఎంతంటే?

బుల్లితెరపై అత్యంత భారీ క్రేజ్ ను సొంతం చేసుకున్న రియాలిటీ షో ‘బిగ్ బాస్ ‘. ఇప్పటికే తెలుగులో 9 సీజన్లు పూర్తి చేసుకున్న ఈ షో .. ఇప్పుడు సరికొత్త ల్యాండ్ మార్క్ తో సీజన్ 10 కు సిద్ధమవుతోంది. కింగ్ అక్కినేని నాగార్జున మరో సారి హోస్ట్ గా అలరించనున్నారు. ఈ సీజన్ 10 ఆగస్టు చివరి వారంలో లేదా సెప్టెంబర్ తొలి వారంలో గ్రాండ్ గా ప్రారంభం కానుంది.
కంటెస్టెంట్ల పాలిట ‘అగ్నిపరీక్ష’
అయితే షో ప్రారంభానికి ముందే ఓ సంచలన వార్త సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈసారి బిగ్బాస్ హౌస్లో ఇప్పటివరకు ఎప్పుడూ లేని విధంగా అత్యంత కఠినమైన నిబంధనలు అమలు చేయబోతున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ 10వ సీజన్ కేవలం ఎంటర్టైన్మెంట్ మాత్రమే కాదు, కంటెస్టెంట్ల పాలిట ‘అగ్నిపరీక్ష’ కాబోతోందని ఇండస్ట్రీ వర్గాల సమాచారం. ఎందుకంటే.. బిగ్ బాస్ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా అత్యంత కఠినమైన రూల్ బుక్ను మేకర్స్ సిద్ధం చేస్తున్నట్లు టాక్.
హద్దు దాటితే భారీ జరిమానా ..
హౌస్లో అసభ్య పదజాలం ఉపయోగించడం, వ్యక్తిగతంగా దూషించడం, మతం, కులం, భాష , ప్రాంతీయ భావోద్వేగాలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం వంటి చర్యలకు భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుందట. అలాంటి నిబంధనలు ఉల్లంఘించిన కంటెస్టెంట్లపై ఏకంగా రూ.10 లక్షల వరకు జరిమానా విధించే అవకాశముందని సమాచారం. అంతేకాదు, ఆ మొత్తాన్ని నేరుగా వారి రెమ్యూనరేషన్ నుంచే కట్ చేస్తారనే టాక్ వినిపిస్తోంది. అయితే దీనిపై షో నిర్వాహకుల నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.
క్రేజీ రూల్ ఎందుకంటే?
గత సీజన్లలో కంటెస్టెంట్ల మధ్య జరిగిన కొన్ని గొడవలు, వ్యక్తిగత దూషణలు, కులం, మతం వంటి సున్నితమైన అంశాలపై జరిగిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాలకు దారితీశాయి. సోషల్ మీడియాలో భారీ నెగెటివిటీని మూటగట్టుకున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ సారి అలాంటి పరిస్థితులు తలెత్తకుండా మేకర్స్ ముందస్తుగా కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అందుకే ఈ షో ఇమేజ్ను కాపాడేందుకు ఒక క్రేజీ రూల్ తీసుకొస్తున్నట్లు టాక్ నడుస్తోంది . హౌస్లో ఆరోగ్యకరమైన పోటీ వాతావరణాన్ని కొనసాగించడమే ప్రధాన లక్ష్యమని నిర్వాహకులు భావిస్తున్నారు.
కంటెస్టెంట్ల లిస్ట్ రెడీ..
ఇప్పటికే కంటెస్టెంట్ల ఎంపిక ప్రక్రియ చివరి దశకు చేరుకుంది. సామాన్యుల కోసం ‘అగ్ని పరీక్ష2’ ద్వారా ఎంపిక చేసేందుకు వడపోత పడుతున్నారు. మరో వైపు యూట్యూబర్లు, టీవీ నటులు, సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్లు, సినీ ప్రముఖులతో చర్చలు జరుగుతున్నాయని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. అయితే ఫైనల్ లిస్ట్ను మాత్రం షో ప్రారంభానికి కొద్ది రోజుల ముందు మాత్రమే ప్రకటించే అవకాశం ఉంది.
గత సీజన్ లాగే మరోసారి అక్కినేని నాగార్జున తన స్టైలిష్ హోస్టింగ్తో ప్రేక్షకులను అలరించనున్నారు.ఈ సీజన్ను స్టార్ మాలో ప్రసారం చేసి, జియోహాట్స్టార్లో స్ట్రీమింగ్ చేయనున్నారు. అయితే ఈ కొత్త రూల్స్ నిజంగా అమల్లోకి వస్తాయా? రూ.10 లక్షల ఫైన్ నిబంధన ఎంతవరకు వాస్తవం? అనే అంశాలపై ఇప్పుడు బిగ్బాస్ అభిమానుల్లో భారీ చర్చ సాగుతోంది. అధికారిక ప్రకటన వచ్చే వరకు ఈ వార్త హాట్ టాపిక్గా కొనసాగే అవకాశం కనిపిస్తోంది.